బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు దవాఖానాలు

బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు దవాఖానాలు
  • రక్తం శాంపిల్ ఇస్తే.. రిపోర్ట్ సెల్ ఫోన్ కే వస్తుంది
  • వైద్యం.. మందులు కూడా ఉచితమే 
  • జీహెచ్ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రారంభించాం
  • ఈ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచింది
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు 

సంగారెడ్డి‌ జిల్లా: బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని.. బస్తీ దవాఖానల్లో 57 రకాల పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వైద్యం.. మందులు కూడా ఉచితమేనని ఆయన పేర్కొన్నారు. రామచంద్రాపురం మండలం భారతీనగర్ డివిజన్ పరిధిలో,  ఎస్.ఎన్ కాలనీలో  బస్తీ ‌దవాఖానాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రారంభించామని.. ఈ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి దవాఖానలో నిపుణుడైన ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటూ  వైద్య సేవలు అందిస్తారని వివరించారు. ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని, బస్తీ దవాఖానాల్లో టీ డయాగ్నసిస్  ద్వారా 57 రకాల పరీక్షలు మీకు ఉచితంగా చేస్తారని వివరించారు. ప్రజలు అనవసరంగా ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు‌ వృధా చేసుకోవద్దని ఆయన సూచించారు. 

ఈ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని.. అందుకే ఈ బస్తీ దవాఖానాలు‌ అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని మంత్రి హరీష్ రావు వివరించారు. టీ డయాగ్నసిస్ ద్వారా దవాఖానకు వచ్చినవారు రక్తం శాంపిల్ ఇస్తే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్ట్ మీ సెల్ ఫోన్లకు  పంపిస్తారని తెలిపారు. బస్తీ దవాఖానల సేవలు ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు. 

ఇవి కూడా చదవండి

అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది

సున్నిపిండి స్నానంతో కలిగే బెనిఫిట్స్ ఇవే..

గ్రానైట్​ అక్రమ రవాణాపై సీబీఐ పూర్తిస్థాయి ఎంక్వైరీ షురూ

విశ్లేషణ: బహుశా కేసీఆర్ ధైర్యశాలి కావొచ్చు