
- హ్యాండ్మేడ్ వస్తువులతో ఆరోగ్యంతోపాటు ఉపాధి అవకాశాలు: భట్టి
- ఆషాఢ బోనాలు అంటేనే కుల వృత్తులు: మంత్రి పొన్నం
- హెచ్ఎండీఏ గ్రౌండ్లో బీసీ కుల వృత్తుల ఎగ్జిబిషన్ ప్రారంభం
- కుమ్మరి కుండను తయారు చేసిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: బీసీ కులవృత్తులను అందరూ ఆదరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హ్యాండ్మేడ్ వస్తువులతో ఆరోగ్యంతోపాటు చాలా మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్ లో బీసీ కుల వృత్తుల ఎగ్జిబిషన్ను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో 30 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కుమ్మరి కులస్తులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి కుండను తయారుచేశారు. పూసల కులవృత్తి వస్తువులు ఉన్న బుట్టను మంత్రి పొన్నంతో కలిసి ఎత్తుకున్నారు. అన్ని స్టాళ్లను పరిశీలించి, వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కులవృత్తుల ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలు ఈ స్టాల్కు వచ్చి ఇక్కడి వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.
ఆషాఢ బోనాల్లో కులవృత్తులదే కీలక పాత్ర: మంత్రి పొన్నం
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో అన్ని కుల వృత్తుల సహకారం ఉంటుందని, బోనం నుంచి మొదలుకొని ప్రతి వస్తువును కులవృత్తుల వాళ్లే తయారు చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కుల వృత్తుల ఎగ్జిబిషన్ను డిప్యూటీ సీఎం ప్రారంభించడం బడుగు బలహీన వర్గాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నదని చెప్పారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ నెల 29 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని, నగర ప్రజలు తరలివచ్చి వస్తువులను కొనుగోలు చేయాలని, కుల వృత్తులను ప్రొత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, అమేర్ అలీఖాన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, శివసేనా రెడ్డి, నాగుల సత్యనారాయణ, మెట్టు సాయి కుమార్, వీరయ్య, జ్ఞానేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, కమిషనర్ బాల మాయాదేవి, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.