- తల్లిదండ్రులకు బీసీ గురుకుల సెక్రటరీ సైదులు వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థలో సీట్లను కేవలం మెరిట్ ప్రకారమే కేటాయిస్తున్నామని సంస్థ సెక్రటరీ సైదులు స్పష్టం చేశారు. సీటు రాని విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాలు, పాఠశాలల చుట్టూ తిరగవద్దని సూచించారు. 2026~27 విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే ప్రవేశాలు జరుగుతున్నాయని, అర్హత గల వారికే సీట్లు లభిస్తాయని సోమవారం ఓ ప్రకటనలో వివరించారు. ఇప్పటికే మెరిట్ ఆధారంగా మొదటి, రెండవ విడత సీట్ల కేటాయింపు పూర్తయిందన్నారు.
5వ తరగతితో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్లు ఇంకా ఏమైనా ఖాళీగా ఉంటే, ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, విద్యార్థుల మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ఎక్కడైనా సీట్లు ఖాళీగా ఉంటే, ఆయా కాలేజీల్లో నేరుగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది గురుకులాల్లో సీట్లకు విపరీతమైన పోటీ పెరిగిందని, సీటు రానివారు హైదరాబాద్లోని హెడ్ ఆఫీసులో కానీ, ఆర్సీవో ఆఫీసుల్లో కానీ, స్కూళ్ల చుట్టూ కానీ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దని సైదులు కోరారు. ఎవరైనా సీట్లు ఇప్పిస్తామని చెబితే వారి మాటలు నమ్మవద్దని, అలాంటి వారిపై 040-23120496 ఫోన్ నంబర్ కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
