IPL వర్క్‌లోడ్‌తోనే భారత ఆటగాళ్లకు గాయాలు?.. BCCI మాస్టర్ ప్లాన్.. ఇంటర్నేషనల్ షెడ్యూల్‌లో మార్పులు!

IPL వర్క్‌లోడ్‌తోనే భారత ఆటగాళ్లకు గాయాలు?.. BCCI మాస్టర్ ప్లాన్.. ఇంటర్నేషనల్ షెడ్యూల్‌లో మార్పులు!

BCCI Admits IPL Workload: ముంబైలోని ప్రధాన కార్యాలయంలో బోర్డు ఉన్నతాధికారులతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, CoE చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆటగాళ్ల వరుస గాయాలపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆటగాళ్లు నాన్‌స్టాప్‌గా మ్యాచ్‌లు ఆడటం, దానికి తోడు రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ (IPL) వర్క్‌లోడ్ వారి ఫిట్‌నెస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోందని భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా వెల్లడించారు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు వెళ్లిన 15 మంది ఆటగాళ్లలో ముగ్గురు, నలుగురు మ్యాచ్ మధ్యలోనే గాయపడటాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇండియన్ బోర్డు, వర్క్‌లోడ్ తగ్గించేందుకు కఠిన మార్గాలు అన్వేషిస్తోంది.

సేనా (SENA) పర్యటనలకు ముందు రెస్ట్:  

క్రికెటర్లపై ఉన్న మితిమీరిన ఒత్తిడిని తగ్గించేందుకు రాబోయే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) షెడ్యూల్‌లో విప్లవాత్మక మార్పులు చేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) లాంటి కీలక పర్యటనలకు వెళ్లేముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతితో పాటు స్థానిక పరిస్థితులకు అలవాటుపడేందుకు వార్మప్ మ్యాచ్‌లు కేటాయించేలా ఎఫ్‌టీపీ టీమ్‌కు ఆదేశాలు జారీ చేశారు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు, CoE మధ్య ఎలాంటి సమాచార లోపం లేదని, కేవలం అధిక మ్యాచ్‌ల వల్లే ఈ ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తున్నాయని సైకియా స్పష్టం చేశారు.

ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌పై ఎఫెక్ట్: 

ఇటీవల హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు రీహాబ్ పూర్తయి జట్టులోకి వచ్చిన వెంటనే మళ్లీ గాయపాడటాన్ని బోర్డు తీవ్రంగా మండిపడింది. దీంతో రిటర్న్ టు ప్లే (RTP) ప్రొటోకాల్‌ను పునఃసమీక్షించి, ప్లేయర్స్ 100 శాతం కోలుకుని కఠినమైన ఫిట్‌నెస్ పరీక్షలు పాసైన తర్వాతే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడించేలా నిబంధనలను తీసుకొచ్చారు. రాబోయే ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ జట్టులో ఎంపికైన నలుగురు ప్లేయర్ల లభ్యత కూడా వారి పూర్తిస్థాయి ఫిట్‌నెస్ రిపోర్ట్‌పైనే ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తేల్చిచెప్పింది.

స్పోర్ట్స్ సైన్స్ హెడ్ పోస్ట్ ఖాళీ:  

మరోవైపు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ పోస్ట్ ఖాళీగా ఉండటంపై వస్తున్న విమర్శలను దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. CoEలో ఇప్పటికే 16 మంది ఫిట్‌నెస్, రీహాబ్ నిపుణులు పని చేస్తున్నారని, కానీ వారిని పర్యవేక్షించేందుకు అత్యున్నత అర్హతలు కలిగిన అంతర్జాతీయ స్థాయి నిపుణుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో తగినంత ప్రతిభ కలిగిన నిపుణులు తక్కువగా ఉన్నారని, త్వరలోనే అత్యుత్తమ ప్రొఫెషనల్‌ను ఎంపిక చేసి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తామని బీసీసీఐ ధీమా వ్యక్తం చేసింది.