
- 70శాతంకు పైగా దిగుమతులపైనే ఆధారం
- ఒక్క ఆలుగడ్డ ఉత్పత్తిలోనే 79 శాతం లోటు: హార్టికల్చర్ స్టడీ
- ఉల్లిగడ్డలో లక్ష టన్నుల కొరత ఉందని వెల్లడి
- దుంప కూరగాయల కొరతకు గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
- రైతులను ప్రోత్సహించాలని నిపుణుల సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దుంప రకం కూరగాయల సాగు తగ్గిపోయింది. సాగుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన విధానాలు లేకపోవడం అడ్డంకిగా మారింది. దాంతో ఆలుగడ్డ, చామగడ్డ, ఉల్లిగడ్డ, పుల్లకంద, బీట్రూట్, క్యారెట్ వంటి ట్యూబర్ క్రాప్స్లో భారీ కొరత నెలకొందని హార్టికల్చర్ శాఖ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
ఈ స్టడీ ప్రకారం.. రాష్ట్రంలో దుంప కూరగాయల ఉత్పత్తి ప్రజల అవసరాల కంటే చాలా తక్కువగా ఉంది. దాంతో దుంపల విషయంలో రాష్ట్రం 70 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి దుంప కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు.
హార్టికల్చర్ శాఖ సిఫారసులు
గత ప్రభుత్వాలు హార్టికల్చర్ శాఖను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ కొరత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దుంప కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండే లక్షణం కలిగి ఉన్నందునా.. వీటి సాగు ఆహార భద్రతను బలోపేతం చేయవచ్చని వారు సూచిస్తున్నారు. రైతులను ప్రోత్సహించడం, అదనపు సాగు భూమిని గుర్తించడం, సాంకేతిక సహాయం అందించడం ద్వారా ఈ కొరతను అధిగమించవచ్చని హార్టికల్చర్ నిపుణులు సిఫారసు చేస్తున్నారు.
చామగడ్డలో 58 శాతం కొరత
చామగడ్డ తలసరి వినియోగం రోజుకు 2 గ్రాములుగా ఉంది. ఏటా 534 టన్నుల శ్యామగడ్డలు అవసరమవుతున్నాయి. అయితే, కేవలం 9-10 ఎకరాల్లో సాగు జరుగుతుండటంతో 225 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. దీంతో 58 శాతం కొరత నెలకొంది. మరో 77 ఎకరాల్లో సాగు పెంచితే కొరతను అధిగమించవచ్చని నిపుణులు తెలిపారు. పుల్లకంద, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి ఇతర దుంప కూరగాయలు కూడా తక్కువగా పండుతుండగా, వీటిని దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది.
ఆలుగడ్డలు 79 శాతం దిగుమతి
రాష్ట్రంలో ఆలుగడ్డ రోజువారీ తలసరి వినియోగం 50 గ్రాములకు పైగా ఉంది. ఏటా 1.79 లక్షల టన్నుల ఆలుగడ్డలు అవసరమవుతున్నాయి. అయితే, కేవలం 38 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. అంటే 79 శాతం ఆలుగడ్డలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. హైదరాబాద్కు ఆగ్రా నుంచి పెద్ద ఎత్తున ఆలుగడ్డలు వస్తుండగా..హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సరఫరా జరుగుతున్నది.
ప్రస్తుతం ఆలుగడ్డ 6,606 ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నది. రాష్ట్ర అవసరాలకు 21 శాతం మాత్రమే పండుతుండటంతో 1.41 లక్షల టన్నుల ఆలుగడ్డ కొరత ఏర్పడుతున్నట్లు హార్టికల్చర్ స్టడీలో తేలింది. ఈ కొరతను అధిగమించేందుకు మరో 17,676 ఎకరాల్లో సాగును పెంచాలని, పాలీహౌస్ల ద్వారా రైతులను ప్రోత్సహించడం ఒక పరిష్కారమని హార్టికల్చర్ నిపుణులు సూచిస్తున్నారు.
ఉల్లిగడ్డ లక్ష టన్నుల కొరత
రాష్ట్రంలో 98 శాతం ప్రజలు ఏటా లక్షల టన్నుల ఉల్లిగడ్డలను ఆహారంలో వినియోగిస్తున్నారు. తలసరి వినియోగం రోజుకు 36 గ్రాములుగా ఉంది. దీంతో రోజుకు 1,260 టన్నులు, ఏటా 4.40 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు అవసరమవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో వికారాబాద్, తాండూరు, నారాయణఖేడ్, కొల్లాపూర్, అలంపూర్, నల్గొండ ప్రాంతాలతో సహా 34 వేల ఎకరాల్లో మాత్రమే ఉల్లి సాగు జరుగుతున్నది.
దీంతో ఏటా లక్ష టన్నుల కొరత నెలకొంటున్నది. ఈ లోటును పూరించేందుకు రూ.500 కోట్ల వ్యయంతో మహారాష్ట్రలోని నాసిక్, కర్నాటక, ఏపీలోని కర్నూల్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్క హైదరాబాద్కే రోజుకు 10 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరమవుతోంది. ధరల హెచ్చుతగ్గుల కారణంగా రైతులు ఉల్లి సాగుకు మొగ్గు చూపడం లేదు. మరో 14 వేల ఎకరాల్లో ఉల్లి సాగును పెంచితే ఈ కొరతను అధిగమించవచ్చని హార్టికల్చర్ స్టడీ తేల్చింది.