
ట్రంప్ రాకతో ఇండియా, అమెరికా సంబంధాల్లో కొత్త చాప్టర్ మొదలైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికా, ఇండియా ప్రజల ప్రోగ్రెస్, ప్రాస్పరిటీకి కొత్త డాక్యుమెంట్గా ఇది నిలిచిపోతుందని చెప్పారు. అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వాగతం’ అని అన్నారు. ‘‘కొత్త చరిత్ర సృష్టిస్తున్నాం. కొత్త అలైన్మెంట్లు, సవాళ్లు, అవకాశాలు, మార్పులతో కూడిన పునాదులు వేస్తున్నాం. 21వ సెంచరీలో ప్రపంచ గమ్యాన్ని నిర్ణయించడంలో.. ఇండియా, యుఎస్ సంబంధాలు, సహకారం ముఖ్య పాత్ర పోషిస్తాయి. రెండు దేశాలు సహజ భాగస్వాములు’’ అని అన్నారు. దీంతో లక్షలాది మంది ప్రజలు చప్పట్లతో మద్దతు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్నది ‘భాగస్వామ్యం’ మాత్రమే కాదని, అంతకుమించిన గొప్ప అనుబంధమని అన్నారు. ట్రంప్ తన కుటుంబంతో కలిసి పర్యటించడమే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. ‘‘మనకు అమెరికా అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. అమెరికాతో కలిసి మన మిలటరీ అతిపెద్ద వార్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తోంది” అని తెలిపారు. ఆరోగ్య రంగంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న కృషిని మోడీ ప్రశంసించారు. నమ్మకమే రెండు దేశాల బలమని చెప్పారు. 130 కోట్ల మంది ఇండియన్లు కలిసి కొత్త ఇండియాను నిర్మిస్తున్నారని మోడీ అన్నారు.