పద్మారావునగర్, వెలుగు: బేగంపేటలోని ఓ పైలట్ ట్రైనింగ్ సంస్థలో ట్రైనీ మహిళా పైలట్పై ఇన్స్ట్రక్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేటలోని ఏవికన్స్ పైలట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ఓ యువతి శిక్షణ పొందుతోంది.
అదే సంస్థలో ఇన్స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న కేరళంకు చెందిన నసీముద్దీన్, దమ్మాయిగూడకు చెందిన సల్మాన్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నసీముద్దీన్ సన్నిహితంగా మెలుగుతూ ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరి 2025 నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ వ్యవహారంలో సల్మాన్ సహకరించినట్లు ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నసీముద్దీన్ను అదుపులోకి తీసుకోగా సల్మాన్ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
