తెలంగాణలో బెల్ట్​షాపులను అరికట్టాలి

తెలంగాణలో బెల్ట్​షాపులను అరికట్టాలి

పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేశానని చెప్పుకునే కేసీఆర్, వాస్తవానికి రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణగా మార్చేసిండు. లక్షల మంది ప్రజలను మందుకు బానిసలను చేసిండు.  ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఒక బంగారు బాతుగా ఎక్సైజ్ శాఖను తయారుజేసిండు. కేసీఆర్ సాధించిన ఈ తిరోగమన విజయం లక్షల మంది ఆడబిడ్డల బతుకులను ఛిద్రం చేసింది. విచ్చలవిడి మద్యపానం పసిబిడ్డలను తండ్రి ఆలన, లాలనకు దూరం చేసింది. నడిపించే తండ్రి లేక, తల్లికి చదివించే స్తోమత లేక బడి వదిలి పనికిపోతున్న బిడ్డలెందరినో తయారుచేసిన ఘనుడు కేసీఆర్. ఈ పదేండ్ల కాలంలో ఎంతోమంది యువకులు తాగుడుకు బానిసలై అనారోగ్యం బారిన, యాక్సిడెంట్ల బారిన పడి చనిపోయారు. తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చారు. తమకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకి తామే తలకొరివి పెట్టాల్సి వచ్చినందుకు ఎంతోమంది వృద్ధులు నిత్యం కుమిలిపోతున్నారు.

చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మూడున్నర లక్షల మంది మహిళలు దీనావస్థలో బతుకీడుస్తున్నారు. ఆర్టీఐ లెక్కల ప్రకారం వితంతు పింఛన్ దారుల సంఖ్య 2014–-15లో 12.78 లక్షలు ఉంటే, 2022–-2023 నాటికి ఈ సంఖ్య15.78 లక్షలకు పెరిగింది. ఈ వితంతువుల్లో లక్ష మంది 35 ఏండ్ల కంటే తక్కువ వయసు గలవారే కావడం శోచనీయం. ఇంకో రెండున్నర లక్షల మంది 40 ఏండ్ల లోపు వయసువారు ఉన్నారు. పెన్షన్లు రాని వితంతువులు ఇంకా 1.59 లక్షల మంది ఉన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళల ఆశలు

ఎక్సైజ్ శాఖ గతంలో మద్యం నియంత్రణ కోసం పనిచేసేది. కానీ, కేసీఆర్ హయాంలో అది మద్యం అమ్మకాల శాఖగా మారిపోయింది. కేసీఆర్ సర్కార్ ఎక్సైజ్ ఆఫీసర్లకు నెల నెలా టార్గెట్లు పెట్టి మద్యం అమ్మకాలు పెరిగేలా చేసింది. తమ టార్గెట్లను రీచ్ అయ్యేందుకు, అమ్మకందారులకు కావాల్సినంత ఫ్రీడమ్‌‌ను ఎక్సైజ్ శాఖ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఊరూరికీ వైన్ షాపులు, గల్లీ గల్లీకి బెల్టుషాపులు పుట్టుకొచ్చినయి. ఎప్పుడంటే అప్పుడు అవసరమైనంత మద్యం తాగేలా జనాలను ప్రభుత్వమే ప్రోత్సహించింది.  వితంతు పెన్షన్లు ఇచ్చి, తానేదో గొప్పగా చేశానని  కేసీఆర్ చెప్పుకుంటున్నాడు. కానీ, వారు వితంతువులుగా మారడానికి కారణమే కేసీఆర్ సర్కార్​అనే విషయాన్ని మహిళా లోకం మర్చిపోదు. మద్యపాన నియంత్రణ, నిషేధం జరగాలని ఆనాటి రోషమ్మ నుంచి ఈనాటి ఎంతో మంది మహిళలు అడుగుతూనే ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను  గత ప్రభుత్వం ఒక ఆదాయంగానే  చూసింది. కానీ, చిన్నాభిన్నమవుతున్న ప్రజల బతుకుల గురించి పట్టించుకోలేదు. నేనే స్వయంగా మద్యపాన నియంత్రణపై ఎన్నో పోరాటాలు చేశాను. మా గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థమవక, విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చిన రోజులు ఉన్నవి.  ప్రస్తుత గవర్నర్ తమిళసైకి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రథమ పౌరురాలైన మహిళా గవర్నర్‌‌‌‌కే, గౌరవం ఇవ్వని గత ప్రభుత్వం  మహిళా రక్షణ, మహిళా సాధికారితపై ఆలోచిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంపై మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

మహిళల ఆర్థిక స్వేచ్ఛకు తొలిఅడుగు

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ జర్నీని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే పథకంతోనే సీఎం రేవంత్‌‌రెడ్డి మొదలుపెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం మహిళలకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా తమ కాళ్లపై తాము నిలబడే ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి ఇదొక తొలి అడుగుగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల మహిళలకు ఒరిగేది ఏమీ లేదంటూ బీఆర్ఎస్​ విష ప్రచారాలు చేస్తుండడం గర్హనీయం. తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే, లక్షకు పైగా బెల్టుషాపులు ఉన్నాయి. ఈ బెల్టుషాపులు అన్నింటినీ రద్దు చేస్తాం అని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఈ హామీని రేవంత్‌‌రెడ్డి  ప్రభుత్వం వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలి. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌‌రెడ్డి ఒక్క పిలుపుతో బెల్టుషాపులు అన్నీ మూయించినట్టుగా వార్తల్లో చూశాం. ఆయనకు రాష్ట్ర మహిళా లోకం తరపున అభినందనలు తెలుపుతున్నాం. బెల్టు షాపులు ఎక్కడున్నాయో, వాటిని ఎవరు నడిపిస్తున్నారో ఎక్సైజ్, పోలీస్ శాఖకు పూర్తి వివరాలు తెలుసు. ఒక పది రోజులు సమయం ఇచ్చి, అవన్నీ బంద్ పెట్టించడం పెద్ద పని కాదు. మద్యానికి బానిసైన వ్యక్తుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక వ్యధను అనుభవిస్తున్నాయి. తమవారితో తాగుడు మాన్పించే దారి కోసం వెయ్యి కండ్లతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. గల్లీకో బెల్టుషాపు పెట్టించిన కేసీఆర్‌‌‌‌, తాగుడును మాన్పించే డీఅడిక్షన్ సెంటర్లను మాత్రం ఏర్పాటు చేయలేదు. 
 
డీఅడిక్షన్​ సెంటర్లు ఏర్పాటు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో లేదా కనీసం ప్రతి జిల్లాకు ఒక అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సైకియాట్రిస్టులను, బాధితులకు అవసరమైన మెడిసిన్‌‌ను అందుబాటులో ఉంచాలి. వితంతువులుగా మారిన మహిళలను ఆదుకునే దిశగా సీఎం రేవంత్‌‌రెడ్డి ఆలోచన చేయాలి. వారికి ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు, ఉపాధి కల్పించేందుకు కొత్త పథకాలు తీసుకురావాలి. వారితో కుటీర పరిశ్రమలు పెట్టించాలి. తాగి అనారోగ్యంతోనో, యాక్సిడెంట్లోనో కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.   పిల్లల్ని పోషించుకోలేక నరకం అనుభవిస్తున్నారు. రేవంతన్న ప్రభుత్వం ఈ నరకం నుంచి తెలంగాణ రాష్ట్ర మహిళలకు విముక్తి కల్పిస్తారని, ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడుతారని  ఆశిస్తున్నాను.

- ఇందిరా శోభన్ పోశాల, తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు