న్యూఢిల్లీ:వరస ఐదు రోజుల నష్టాలకు బుధవారం బ్రేక్ పడింది. గత రెండు సెషన్లలో భారీగా పడిన ఐటీ షేర్లలో బయ్యింగ్ రావడంతో పాటు, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్లు పెరగడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి బలపడడం మార్కెట్కు సపోర్ట్గా నిలిచింది. సెన్సెక్స్ బుధవారం 574 పాయింట్లు (1.02 %) పెరిగి 57,038 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ 178 పాయింట్లు (1.05 %) లాభపడి 17,137 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో 20 షేర్లు లాభాల్లో క్లోజవ్వగా, 10 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఎఫ్ఐఐలు వెళ్లిపోతున్నా..
గత కొన్ని సెషన్లలో బాగా నష్టపోయిన హెచ్డీఎఫ్సీ షేర్లు, ఐటీ షేర్లు రికవరీ అవ్వడంతో మార్కెట్ లాభపడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నప్పటికీ, డొమెస్టిక్ ఇన్వెస్టర్ల నుంచి సపోర్ట్ లభిస్తుండడంతో మార్కెట్ ఎక్కువగా నష్టపోవడం లేదని చెప్పారు. ‘గ్లోబల్ అంశాలు సద్దుమణిగి ఎఫ్ఐఐల నుంచి అమ్మకాల ఒత్తిడి తగ్గేంత వరకు మార్కెట్లో వోలటాలిటీ ఇప్పటిలానే కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి పెద్ద కంపెనీల రిజల్ట్స్ అంచనాలకు అందుకోలేకపోవడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నారని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ ఎస్ హరిహరన్ అన్నారు. బుధవారం బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.45 %, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.36 % పెరిగాయి. మొత్తం 1,738 షేర్లు లాభాల్లో ముగియగా, 1,662 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 110 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. సెక్టార్ల పరంగా చూస్తే, ఆటో, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికం ఇండెక్స్లు లాభాల్లో ముగిశాయి. మెటల్, యుటిలిటీస్, బ్యాంక్ ఇండెక్స్లు నష్టాల్లో క్లోజయ్యాయి. హాంకాంగ్, సియోల్, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ముగియగా, టోక్యో మార్కెట్ లాభపడింది. యూరప్లోని మెజార్టీ ఇండెక్స్లు లాభాల్లో ట్రేడయ్యాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు 0.89 % పెరిగి బ్యారెల్ 108.2 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 29 పైసలు బలపడి 76.21 వద్ద సెటిలయ్యింది.
ఆల్టైమ్ హైకి చేరువలో రిలయన్స్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బుధవారం సెషన్లో దూసుకుపోయింది. కస్టమైజ్డ్ క్లాత్స్ను డిజైన్ చేసే అబు జాని సందీప్ ఖోస్లే కోచర్లో మెజార్టీ వాటాను రిలయన్స్ బ్రాండ్ కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ను ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లలో మరింత విస్తరించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ గ్రూప్ అసెట్స్ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బుధవారం సెషన్లో 2.90 % పెరిగి 2,718 వద్ద క్లోజయ్యింది. కంపెనీ షేరు ఏడాది గరిష్టమైన రూ. 2,751 లెవెల్కు దగ్గరలో ట్రేడవుతోంది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17.90 లక్షల కోట్లకు పెరిగింది. బెంచ్మార్క్ ఇండెక్స్లయిన సెన్సెక్స్, నిఫ్టీల బుధవారం సెషన్ లాభాల్లో రిలయన్స్ వాటానే సగముంది.
రిలయన్స్కు ఫ్యూచర్ అప్పులు..
తన అప్పుల్లో 45 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్కు ట్రాన్స్ఫర్ చేయాలనే ప్రపోజల్ను ఫ్యూచర్ గ్రూప్ తీసుకొచ్చింది. రిలయన్స్కు ఆస్తులను అమ్మి, తన అప్పుల్లో కొంత భాగాన్ని రిలయన్స్ లోన్ బుక్కు ట్రాన్స్ఫర్ చేయాలనేది ప్లాన్. కానీ, దీనిపై ఫ్యూచర్ గ్రూప్ లెండర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఆఫర్పై రిలయన్స్ నుంచి ఎటువంటి హామీ లేకపోవడంతో లెండర్లు అసంతృప్తిగా ఉన్నారని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. కాగా, ఫ్యూచర్ గ్రూప్ బకాయిలు రూ. 28,921 కోట్లు కాగా, ఇందులో రూ. 12,612 కోట్లను రిలయన్స్కు ట్రాన్స్ఫర్ చేయాలని ఫ్యూచర్ గ్రూప్ ప్రపోజ్ చేసింది. మిగిలిన రూ. 16,309 కోట్లను దశల వారీగా తీర్చాలని చూస్తోంది. ఇందులో రూ.5,653 కోట్లను రిలయన్స్కు ఆస్తులను అమ్మడం ద్వారా చెల్లించనుంది. రూ. 2,755 కోట్లను ఇన్సూరెన్స్ కంపెనీల్లోని తన వాటాలను అమ్మడం ద్వారా తీర్చనుంది. రూ. 3,500 కోట్ల అప్పును ఈక్విటీగా మార్చాలని, మరో రూ. 8,196 కోట్లను ఏడున్నరేళ్లలో చెల్లించాలని ప్లాన్ చేసుకుంది.