
అమరావతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి దశకు చేరుకుంది. లీగ్లో మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్ చేరగా.. క్వాలిఫయర్ 2లో తలపడనున్న ముంబై, పంజాబ్ జట్లలో గెలిచిన టీమ్ ఫైనల్కు చేరుకోనుంది. ఐపీఎల్ ఫైనల్కు చేరుకోవడంతో బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. బెట్టింగ్ రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
ఆ జట్టు గెలుస్తుందని కొందరు.. లేదు ఈ జట్టు విజయం సాధిస్తుందని ఇంకొందరు పందెం రాయుళ్లు బెట్టింగ్లు కాస్తున్నారు. మరికొందరు ఆన్ లైన్ బెట్టింగ్యాప్స్ ద్వారా పందెలు వేస్తున్నారు. వన్ ఎక్స్ బెట్, మెగాపరి, మేట్బెట్, బెట్365, డఫ్పా బెట్లాంటి వెబ్సైట్స్, యాప్స్లో ప్రస్తుతం బెట్టింగ్ దందాజోరుగా నడుస్తోంది. బెట్టింగ్ ఇల్లీగల్ కావడంతో పందెం రాయుళ్లపై పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఇల్లీగల్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పైన నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఏపీలోని కర్నూల్ జిల్లాలో బెట్టింగ్ కలకలం రేపింది.
శనివారం (మే 31) ఏడుగురు అంతరాష్ట్ర క్రికెట్ బుకీలను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో బుకీలను అదుపులోకి తీసుకున్నారు. బుకీల నుంచి రూ.91లక్షల నగదు,7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 5 బెట్టింగ్ యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా యువతకు కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక సూచన చేశారు.
బెట్టింగ్ యాప్ ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యాశకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2025, జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగే ఛాన్స్ ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.