- స్పెషల్ ఆఫీసర్గా ఆర్అండ్బీ రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు నియామకం
- ఎండోమెంట్ డైరక్టర్ హన్మంతరావు వెల్లడి
భద్రాచలం, వెలుగు: సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్ నుంచే ప్రతీ రోజు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తామని ఎండోమెంట్ డైరక్టర్ హన్మంతరావు తెలిపారు. పనుల పర్యవేక్షణకు ఆర్అండ్బీ రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశ్వరరావును స్పెషల్ ఆఫీసర్గా నియమించినట్లు ప్రకటించారు. భద్రాచలంలో జరుగుతున్న దేవస్థానం అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించగా, ఈవో దామోదర్రావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఉత్తరద్వారం, పడమర మెట్లు, దక్షిణం దిక్కున జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు స్లోగా జరుగుతున్నాయని, జీరో ప్రోగ్రెస్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. 24 గంటలు పని చేస్తేనే గడువులోగా పనులు పూర్తవుతాయని, భారీ యంత్రాలను సమకూర్చాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. డిసెంబరు 20న ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తరద్వారం అప్పగించాలంటే, నవంబర్ నెలాఖరునేడెడ్లైన్గా పెట్టుకోవాలన్నారు.
వారానికోసారి ఈవో దామోదర్రావు, 15 రోజులకోసారి తాను, నెల రోజులకోసారి ఎండోమెంట్ మినిస్టర్ పనుల పురోగతిపై రివ్యూ చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచలంలోనే ఉండి పనులు పర్యవేక్షించడంతో పాటు కాంట్రాక్టర్, ఆఫీసర్లు, ఆర్కిటెక్లను సమన్వయం చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ను నియమించినట్లు తెలిపారు. మిగిలిన ఆలయాలతో పోల్చితే భద్రాచలం రామాలయం భిన్నమైందని, ఉత్సవాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకుని పనులపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. అనంతరం ఈవో, ఆర్అండ్బీ ఇంజనీర్లు, ఆర్కిటెక్లతో సమావేశం నిర్వహించారు. ఆర్అండ్బీ సీఈ వెంకటేశ్వర్లు, ఎండోమెంట్ ఈఈ రవీందర్రాజు, స్థానాచార్యులు స్థలసాయి పాల్గొన్నారు.
