పబ్లిక్​ హెల్త్​ ఇంజనీర్లపై భద్రాద్రి కలెక్టర్​ ఆగ్రహం

పబ్లిక్​ హెల్త్​ ఇంజనీర్లపై భద్రాద్రి కలెక్టర్​ ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఐదుగురు కూలీలతో రూ. కోట్ల విలువ చేసే ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ పనులెట్లా పూర్తి అవుతాయంటూ కలెక్టర్​ అనుదీప్​ పబ్లిక్​ హెల్త్​ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లో పట్టణ ప్రగతి పనులపై జిల్లాలోని మున్సిపాలిటీ చైర్మన్లు, కమిషనర్లు, డీఈలు, ఏఈలు, టీపీవోలతో బుధవారం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ల పనులు స్లోగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈఈ, డీఈలకు షోకాజ్​ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్​ నిర్లక్ష్యంగా పనులు చేస్తుంటే మీలో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వేసవిలో మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ వెహికల్స్​కు ఫ్యుయల్​​ వినియోగంపై పర్యవేక్షణ ఉండాలన్నారు. 15 రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో చేపట్టిన ఫుట్​బాల్, బాస్కెట్​ బాల్, అథ్లెటిక్స్​ ట్రాక్​ నిర్మాణ పనులను వీడియో ద్వారా పరిశీలించారు. కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్​ చైర్​పర్సన్​లు కె. సీతాలక్ష్మి, డి.వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మున్సిపల్​ స్పెషల్​ ఆఫీసర్​ అర్జున్, మున్సిపల్​ కమిషనర్లునవీన్, శ్రీకాంత్, మాధవి, అంకుషావళి పాల్గొన్నారు. 

టీబీ రహిత జిల్లాగా మార్చాలి

టీబీ రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్​ అనుదీప్​ సూచించారు. పట్టణంలోని ఐఎంఏ హాల్​లో టీబీ వ్యాధి, తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులు, సిబ్బందికి బుధవారం ట్రైనింగ్​ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 18 ఏండ్ల వయస్సు వారు టీబీ బారిన పడకుండా చేపట్టాల్సిన చర్యలపై శిక్షణ ఇవ్వడం హర్షణీయమన్నారు. అన్ని ప్రాథమిక కేంద్రాలు, అంగన్​వాడీ సెంటర్లలో టీబీ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. బూర్గంపహాడ్, అశ్వారావుపేట్​ గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో పిల్లల వైద్య నిపుణులను నియమించేందుకు ప్రపోజల్స్​ ఇవ్వాలని డీఎంహెచ్​వో దయానందస్వామిని ఆదేశించారు. టీబీ ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్​ శ్రీనివాసరావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్​ విజయ్​ కుమార్, ఎంజీఎం పిల్లల వైద్య నిపుణులు డాక్టర్​ విజయ్​కుమార్, ఉస్మానియా హాస్పిటల్​ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్​ శ్రీనివాసరావు పాల్గొన్నారు.