
- కొత్తగూడెం కలెక్టర్ కు ఆధారాల సమర్పణ
- అశ్వారావుపేట రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీస్
- విచారణ జరపాలని ఆర్డీవోకు ఆదేశాలు
అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం), వెలుగు : పదెకరాల భూమిని రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించేందుకు రూ.60 లక్షలు డిమాండ్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రెవెన్యూ ఉద్యోగికి కలెక్టర్ అనుదీప్ షోకాజ్ నోటీసు ఇష్యూ చేశారు. విచారణ జరపాలని ఆర్డీవోను ఆదేశించారు. అశ్వారావుపేట సర్వే నెంబర్ 1130/15/1/2,1130/15/1లో దూపకుంట్ల మోహన్ రావుకు పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని రెవెన్యూ రికార్డులో ఎక్కించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అశ్వారావుపేట రెవెన్యూ శాఖలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ గుర్రం ప్రభాకర్రావు రూ.60 లక్షలు ఇస్తేనే పనవుతుందని స్పష్టం చేశాడు. విషయాన్ని స్నేహితుడైన చిక్కం గోపాలకృష్ణకు చెప్పగా అతడు సీనియర్ అసిస్టెంట్ తో ఫోన్లో మాట్లాడాడు. వాయిస్ రికార్డు చేయడమే కాకుండా, వాట్సాప్ చాటింగ్ చేసి స్క్రీన్షాట్స్తీసుకున్నాడు. వీటిని పెన్ డ్రైవ్ లో వేసుకొని మే 12 న కలెక్టర్ అనుదీప్ కు అందజేసి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన సీనియర్ అసిస్టెంట్ గుర్రం ప్రభాకరరావుకు షోకాజ్నోటీసు ఇచ్చారు. విచారణ జరపాలని ఆర్డీవో స్వర్ణలతను ఆదేశించారు. ఈ విషయమై అశ్వారావుపేట తహసీల్దార్ లూథర్ విల్సన్ బాబును వివరణ కోరగా సీనియర్ అసిస్టెంట్ గుర్రం ప్రభాకర్పై వచ్చిన ఆరోపణలపై షోకాజ్నోటీస్ ఇష్యూ చేసింది నిజమేనని, ఆర్డీవో దీనిపై విచారణ జరుపుతున్నారన్నారు.