భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లతండా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ అమలులో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్డెన్కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. పాఠశాల పరిసరాల అపరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనిచేయని ఆర్వో ప్లాంట్కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం చాతకొండ ఆరో బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఆపద మిత్రల ట్రైనింగ్ ప్రోగ్రామ్లో కలెక్టర్ పాల్గొన్నారు. విపత్తుల సమయంలో తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆపద మిత్రలు కీలక పాత్ర పోషించాలన్నారు. విపత్తుల సమయంలో నిర్వహించాల్సిన విధులు, సేవలపై పూర్తి అవగాహన పొందాలని సూచించారు.
శిక్షణ పొందుతున్న ఆపద మిత్రలకు మూడేండ్లపాటు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు బెటాలియన్ కమాండెంట్ పీసీవీ రమణ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 416 మందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు మొదటి దశ ట్రైనింగ్ జరుగుతోందన్నారు. ఈ ప్రోగ్రాంలో కమాండెంట్ శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండెంట్ మరియా దాస్ పాల్గొన్నారు.
