
వరంగల్, వెలుగు: హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలోనే భద్రకాళి చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులను మెప్పిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన భద్రకాళి ఆలయం వద్ద వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం భద్రకాళి చెరువులో పూడికతీత, సుందరీకరణ పనులను పర్యవేక్షించారు.
వరంగల్లో భద్రకాళి ఆలయ పరిసరాలను టూరిజం స్పాట్గా డెవలప్ చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయ మాడవీధులు, రాజగోపురాలకు సీఎం రేవంత్రెడ్డి రూ.30 కోట్లు మంజూరు చేశారన్నారు. సోలార్ సిస్టం ఏర్పాటు చేసి లైటింగ్ ఉండేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొందరు చెరువు విస్తరణ తగ్గిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మొద్దన్నారు.
గత పాలకుల వల్లే డబుల్ ఇండ్ల పంపిణీలో సమస్యలు
హనుమకొండ : గత ప్రభుత్వ హయాంలో కొందరు దళారులు, పాలకులు డబ్బులు వసూలు చేయడం వల్ల హనుమకొండ అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో సమస్యలు తలెత్తాయని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాలనలో అప్పటి ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా పేదలకు ఇవ్వలేక పోయిందని విమర్శించారు. త్వరలోనే అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.