భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవం జరపనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్తో పాటు భద్రాచలంలోని కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు దేవస్థానం ఈవో దామోదర్రావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
శనివారం నుంచి bhadradritemple.gov.in వెబ్సైట్లో శనివారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ నుంచి భద్రాచలంలోని ఆలయం వద్ద, తానీషా కల్యాణ మండపం, బ్రిడ్జి పాయింట్ సీఆర్వో ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్లో కౌంటర్ల ద్వారా టిక్కెట్లు విక్రయిస్తామని పేర్కొన్నారు.
ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు ఈ నెల 20 నుంచి 27వ తేదీ ఉదయం 6 గంటల వరకు తానీషా కల్యాణ మండపంలోని సీఆర్వో ఆఫీస్ను సంప్రదించి ఒరిజినల్ టికెట్లు పొందవచ్చన్నారు. భద్రాచలం రాలేని వారు పరోక్షంగా తమ గోత్రనామాలతో కల్యాణం జరిపించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని, వీటికి సంబంధించి రూ. 5 వేలు, రూ.1,116ల టిక్కెట్లను సైతం ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
