
న్యూఢిల్లీ : పాపులర్ బాండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ భారత్ బాండ్ ఈటీఎఫ్ ఈ ఏడాది డిసెంబర్లో తమ నాలుగో విడతను లాంచ్ చేయనుంది. కిందటేడాది డిసెంబర్లో లాంచ్ అయిన మూడో విడత సైజులోనే నాలుగో విడత కూడా ఉంటుందని అంచనా. కిందటేడాది డిసెంబర్లో భారత్ బాండ్ ఈటీఎప్ మూడో విడతను రూ. 1,000 కోట్ల ఇష్యూ సైజుతో లాంచ్ చేశారు. కానీ, అప్పుడు ఏకంగా రూ. 6,200 కోట్ల బాండ్లకు బిడ్స్ దక్కాయి. కాగా, భారత్ బాండ్ ఈటీఎఫ్ ద్వారా సేకరించిన ఫండ్స్ను కేవలం ‘ఏఏఏ’ రేటింగ్ ఉన్న ప్రభుత్వ కంపెనీల బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తారు.
ఇన్వెస్టర్లు ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బాండ్ల మెచ్యూరిటీ, కూపన్ రేటు (వడ్డీ రేటు) వివరాలు త్వరలో బయటకొస్తాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రస్తుతం 5 రకాల మెచ్యూరిటీలను ఆఫర్ చేస్తోంది. అవి 2023, 2025, 2030, 2031, 2032 లలో మెచ్యూర్ అయ్యే ఐదు ఆప్షన్లను ఆఫర్ చేస్తోంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ దేశంలోని మొదటి కార్పొరేట్ బాండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. 2019 లో ఈ ఫండ్ను తీసుకురాగా మొదటి విడతలో ప్రభుత్వ కంపెనీలు రూ.12,400 కోట్లను సేకరించడంలో ఈ ఫండ్ సాయపడింది. రెండో విడతలో రూ.11,000 కోట్లు, మూడో విడతలో రూ.6,200 కోట్లను సేకరించారు. భారత్ బాండ్ ఈటీఎఫ్ స్కీమ్కు ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్గా పని చేస్తోంది.