ఇవాళ ఆర్టీసీ.. రేపు సింగరేణి.. ప్రైవేటుకు సేల్

ఇవాళ ఆర్టీసీ.. రేపు సింగరేణి.. ప్రైవేటుకు సేల్
  • కేసీఆర్ మాటలు చూస్తుంటే స్టేట్ ఫర్ సేల్ అనేట్టున్నారు
  • కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేస్తానన్న సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చేశారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పాలన చేయలేక రాష్ట్రాన్ని దివాలా తీయించి, ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మూడు లక్షల కోట్లు అప్పులు చేసిన సీఎం మరో మూడు లక్షల కోట్లు అప్పులు చేసేలా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ఫ్యూడలిస్టు భావాలతో పని చేస్తున్నారని,  తెలంగాణ రాష్ట్రం ఆయన సొంత ఎస్టేట్ కాదని చెప్పారు. మంచి పాలన ఇవ్వాలని కేసీఆర్ కి ప్రజలు అధికారం ఇస్తే, దాన్ని ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ఆస్తులు ప్రైవేటుకివ్వడానికి కేసీఆర్ ఎవరు?

సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఉందని భట్టి అన్నారు. ఇవాళ ఆర్టీసీ, రేపు సింగరేణి.. ఇలా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టేలా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ ఆర్టీసీ సర్కారు తీరుతోనే ఆరేండ్లలో దివాలా తీసిందని అన్నారు. ప్రజలతో ఉన్న రూట్లను ప్రైవేటీకరణ చేయడం అంటే అమ్మడం అన్నట్లేనని అన్నారాయన. ఆర్టీసీ ఒకరోజుతో నిర్మించింది కాదని, దశాబ్దాల కష్టంతో వచ్చిన ఆస్తి అని చెప్పారు. ప్రజల ఆస్తులు, ప్రజల రూట్లు ప్రైవేటికరణ చేసేందుకు కేసీఆర్ ఎవరు అని ప్రశ్నించారు భట్టి.

ఇప్పటికైనా చర్చలకు పిలవాలి

కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని భట్టి విక్రమార్క సూచించారు. కార్మికుల మరణాలకు ప్రతిపక్షాలు కారణం కాదని, ప్రభుత్వమే కారణమని, కేసీఆర్ గతంలో చెప్పిన హామీలనే కార్మికులు నేడు నెరవేర్చాలని కోరుతున్నారని అన్నారు.  ఆర్టీసీ అనేది ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అని అన్నారు. ఆర్టీసీపై ఏ నిర్ణయం అయినా చట్ట సభల్లో చర్చలు జరపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కనీసం ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు భట్టి.