హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: భట్టి

హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: భట్టి
  • విలువైన భూములను బీఆర్ఎస్ కొల్లగొట్టింది
  • గ్రేటర్‌‌‌‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తామని వెల్లడి

ముషీరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తులు సృష్టించి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ గత పదేండ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు సిటీలోని విలువైన భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పునాదులే నేడు అభివృద్ధి ఫలాలుగా కనబడుతుంటే.. తామే చేశామంటూ బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

సోమవారం సికింద్రాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ కమిటీ నాయకుల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొని, మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌ వేర్వేరు కాదని, రెండు పార్టీలు ఒక్కటేనని, పార్లమెంట్‌‌ ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓటేయొద్దని పిలుపునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పరిపాలన చేసి, రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. లక్షల కోట్ల రాష్ట్ర సంపదను దోపిడీ చేసి ఫామ్ హౌస్‌‌లు కట్టుకోవడం తప్ప.. హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమిటని ప్రశ్నించారు.

గత పదేండ్లలో హైదరాబాద్‌‌ను ఏం డెవలప్‌‌ చేశారు.. తాగు నీరు తీసుకొచ్చారా? కొత్త పరిశ్రమలు పెట్టారా? కొత్త విద్యాసంస్థలు నెలకొల్పారా? పేద మధ్య తరగతి ప్రజలకు కొత్త హౌసింగ్ బోర్డు నెలకొల్పారా? ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. 

బీఆర్‌‌‌‌ఎసోళ్లు వీధి రౌడిల్లా మాట్లాడుతున్నరు.. 

పాలకులు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి తప్ప.. వీధి రౌడీల్లా మాట్లాడటం సరికాదని భట్టి పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, అలాంటివి మాట్లాడటం మానుకోవాలన్నారు. రాముడు అందరికి దేవుడని, మతం పేరిట ప్రజలను విభజించి రాముడి పేరిట రాజాకీయాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని భట్టి సూచించారు. హైదరాబాద్‌‌లో మతం పేరితో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారి ఆటలను సాగనివ్వమన్నారు. హైదరాబాద్‌‌లో కరెంటు కోతాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి సూచించారు.