
- ఉచిత విద్యుత్ పథకాలకు ఏటా రూ.17 వేల కోట్లు
- పాత థర్మల్ ప్లాంట్ల స్థానంలో కొత్త ప్లాంట్ల నిర్మాణం
- విద్యుత్ ఒప్పందాల అమలుపై రోజువారీగా సమీక్షలు
- డైరెక్టర్లకు స్వేచ్ఛనిస్తాం, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చాలని సూచన
- జెన్ కో డైరెక్టర్లు, అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే ఐదు, పదేండ్లలో ఏర్పడే విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని, దానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శుక్రవారం ప్రజాభవన్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, జెన్కో డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో 2023 మార్చిలో 15,497 మెగావాట్లు, 2025 మార్చిలో 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. దీనిని పరిగణనలోకి తీసుకొని, 2029-–30, 2030-–35.. అలాగే 2047 నాటికి డిమాండ్ను అంచనా వేసి, దానికి తగినట్లుగా వివిధ మార్గాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేయండి” అని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, పెరుగుతున్న వినియోగం, మారుతున్న జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేయాలన్నారు.
రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఆర్థిక శాఖ ద్వారా ఏడాదికి రూ.12,500 కోట్లు చెల్లిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అదేవిధంగా నిరుపేదలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, భవిష్యత్తులో ఇది రూ.3 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఏటా ఉచిత విద్యుత్ పథకాల కోసం రూ.17 వేల కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని వివరించారు.
గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్పై దృష్టి
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచేందుకు చర్యలు చేపట్టాలని, ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా 6.70 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి ఆదాయ మార్గాలను సృష్టించాలన్నారు. ఫ్లోటింగ్ సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిపారుదల శాఖ, జెన్కో సమన్వయంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు.
50 ఏళ్ల క్రితం నిర్మించిన రామగుండం, కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ల స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ను 2019లో మూసివేయగా, అక్కడ 500 ఎకరాల స్థలం, బొగ్గు అందుబాటులో ఉన్నందున 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చాన్స్ ఉందన్నారు. అలాగే, నిజాం కాలం నాటి 62.5 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను మూసివేసినందున అక్కడ కూడా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.
దేశానికి రోల్ మోడల్గా రెడ్కో
టీజీ రెడ్కో దేశానికి రోల్ మోడల్గా నిలవాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. రెడ్కోకు అవసరమైన సిబ్బంది, సౌకర్యాల కోసం ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. డైరెక్టర్లకు కావాల్సినంత స్వేచ్ఛను ఇస్తామని, ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. దావోస్, హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల అమలుపై రోజువారీ సమీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.