ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు దళితులు గుర్తుకు వస్తారు

ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు దళితులు గుర్తుకు వస్తారు

ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు దళితులు గుర్తుకు వస్తారని  సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. గొర్రెల స్కీం, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం పాదయాత్ర శిబిరం నుంచి సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. వెట్టి చాకిరి కింద గ్రామాల్లో ఇచ్చిన భూములని కేసీఆర్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. ఫార్మాసిటీ పేరుతో 7 వేల ఎకరాలు దళిత గిరిజనుల వద్ద నుంచి గుంజుకున్నారని మండిపడ్డారు. దళితులకు, గిరిజనులకు క్యాబినెట్లో సముచిత  స్థానం కల్పించకుండా అవమానపరిచింది నిజం కాదా అని ప్రశ్నించారు.

అంబేద్కర్ కు నివాళి అర్పించారా...

దళితుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఏ రోజు అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించారా అని ప్రశ్నించారు. ప్రతి ఏటా అంబేద్కర్ను  అవమానించారని మండిపడ్డారు. దళిత గిరిజనులను మోసం చేసే ప్రక్రియ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  2014 లో విగ్రహం పెడతా అని చెప్పిన కేసీఆర్..ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే భయంతోనే విగ్రహం ఏర్పాటు చేశారని చురకలంటించారు.