సమస్యలు చెబుదామంటే సీఎం దొరకడం లేదు

సమస్యలు చెబుదామంటే సీఎం దొరకడం లేదు

ప్రజా సమస్యలు చెబుదామంటే సీఎం అసలు దొరకడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.  స్కూల్ విద్యార్థులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభించాలని ఆయన అన్నారు. పాఠశాలలను తెరిచిన కొద్దీ రోజుల్లోనే మళ్ళీ మూసివేయడం వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని భట్టి అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా భట్టి అసెంబ్లీలో మాట్లాడారు. ‘విద్యార్థులకు నెల రోజుల్లో రెండు డోసుల వ్యాక్సిన్ వేయాలి. కరోనా తగ్గే వరకు బార్లు మూసివేసి.. బెల్ట్ షాపులను కంట్రోల్ చేయాలి. బడ్జెట్ భారీగానే పెట్టినందుకు సంతోషం. బడుగు బలహీన వర్గాలకు కేవలం 5 వేల కోట్లు మాత్రమే కేటాయించడం బాధేస్తోంది. విద్యా-వైద్యానికి దేశ సగటుతో పోల్చితే తక్కువగా కేటాయించారు. గ్రామాల్లో రోడ్లపై దృష్టి పెట్టాలి. పీఎంజీఎస్‌వై రోడ్లు తప్ప.. రెండేళ్ల నుంచి అదనపు రోడ్లు ఇవ్వడం లేదు. పంచాయితీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఉద్యమంలో సకల జనుల పాల్గొన్నారు. పేద మహిళల కోసం ఏర్పాటు చేసిన IKP బలహీనపడుతుంది.  IKP కంటే మెరుగుగా ఉండేదాని గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. వెల్ఫేర్‌కి రెండేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదు.  గ్రామాలకు వెళ్లే నిధులు దారి మల్లుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆదాయం అన్ని రకాల ప్రజలకు ఒకేలా ఉండాలి, కానీ అలా ఉండటం లేదు. ఇండియాలో 71 శాతం సంపద కేవలం ఒక్క శాతం ప్రజల చేతుల్లోనే ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఒక్క శాతం సంపదను 50 శాతం ప్రజలు పంచుకుంటున్నారని కూడా సర్వేలు చెప్తున్నాయి. పెన్షన్స్-కల్యాణ లక్ష్మీ- షాదీముబారక్ తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే అని ఈటెల అన్న మాటలతో ఏకీభవిస్తాను. మూడెకరాల భూమి-డబుల్ బెడ్ ఇండ్లు ఇచ్చి ఉంటే పేదల తలసరి ఆదాయం పెరిగి ఉండేది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతుంది. ఇకనుంచి గతంతో పోలికలు ఉండకూడదు. ప్రభుత్వం సరైన రివ్యూలు చేస్తే.. కనీసం ప్రైవేట్ సెక్టార్‌లోనైనా మంచి జీతాలు వస్తాయి. ధరణిలో 1 లక్షకు పైగా గ్రీవెన్సిస్ వచ్చాయి. ట్రైబల్ ఏరియాల్లో 1965కు ముందు ఉన్న వాళ్లకు ధరణిలో రావడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. కృష్ణానదిపై ఏపీ కడుతున్న ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఏపీ కడుతున్న ప్రాజెక్టు వల్ల 29 లక్షల ఎకరాలకు నష్టం ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించడం వల్ల 7వేల మంది ఉద్యోగం కొల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలపై విజ్ఞపి చేద్దామంటే సీఎం దొరకడం లేదు’ అని భట్టి అన్నారు.