- జనవరి నుంచి అమల్లోకి తెచ్చేలా ప్రణాళికలు
- ప్రతి సర్వే నంబర్కు మ్యాప్.. ఆధార్ లాగిన్తో పూర్తి సమాచారం
- సీసీఎల్ఏలో మంత్రి ఆకస్మిక తనిఖీ.. అధికారులతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ, వీటిని ‘భూభారతి’ పోర్టల్తో అనుసంధానం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ ఆధునీకరించిన వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.
నాంపల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయాన్ని సోమవారం మంత్రి పొంగులేటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘భూ పరిపాలన వ్యవస్థను మరింత వేగవంతం చేసేందుకు ఇంటిగ్రేటెడ్గా రూపొందిస్తున్న ‘భూభారతి’ పోర్టల్ తో రైతుల కష్టాలు తీరుతాయి. ఒక్క క్లిక్తో రైతుకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభిస్తుంది.
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూమి మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నంబర్కు మ్యాప్, నాలా ఆర్డర్లు, ఆర్వోఆర్, గ్రామాల నక్షా, ఫీడ్ బ్యాక్ వంటి సమగ్ర వివరాలు ఈ పోర్టల్లో ఉంటాయి. ఆధార్ నంబర్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే ఈ సమాచారమంతా పొందొచ్చు”అని మంత్రి వివరించారు.
క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సర్వే నంబర్కు మ్యాప్ను రూపొందించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో తెస్తున్న ప్రతి మార్పు, ఆధునీకరణలో సామాన్యుడి కోణం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి లోపాలకు, రికార్డుల తారుమారుకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహశీల్దార్ కార్యాలయాలన్నీ ఒకే మోడల్లో ఉండేలా డిజైన్ రూపొందించాలన్నారు.
సీసీఎల్ఏ నిర్వహణపై మంత్రి అసహనం
రాష్ట్ర భూ పరిపాలనకు కేంద్ర బిందువైన సీసీఎల్ఏ కార్యాలయ నిర్వహణ తీరుపై మంత్రి పొంగులేటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం అపరిశుభ్రంగా ఉండటం, నిర్వహణ లోపాలను గమనించిన ఆయన.. ఆఫీసును కార్పొరేట్ కార్యాలయానికి ధీటుగా ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి ఆకస్మిక తనిఖీకి వస్తానని, అప్పటికి మార్పు కనిపించాలని హెచ్చరించారు. ఇకపై వరుసగా విభాగాల వారీగా సమీక్షలు ఉంటాయని, అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
రికార్డుల ప్రక్షాళన.. పెండింగ్ కేసుల రివ్యూ
దశాబ్దాల కింద ప్రభుత్వం వివిధ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించిన భూములు ఇప్పటికీ రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదనే కొనసాగుతుండటంపై మంత్రి దృష్టి సారించారు. వెంటనే రికార్డులను మార్చాలని ఆదేశించారు. అలాగే.. అసైన్డ్, భూదాన్ భూములపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉద్యోగులపై ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న విజిలెన్స్ కేసులు, కోర్టు కేసులపై పూర్తిస్థాయిలో సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, సీసీఎల్ఏ ఇన్చార్జ్ కార్యదర్శి మంద మకరంద్, ఎన్ఐసీ ఎస్ఐవో ప్రసాద్, విజయ్మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
