స్మగ్లర్​ పాత్రకు గద్దర్​ అవార్డు ఇస్తారా? : భూపతి వెంకటేశ్వర్లు

స్మగ్లర్​ పాత్రకు గద్దర్​ అవార్డు ఇస్తారా? : భూపతి వెంకటేశ్వర్లు
  •     తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు

ముషీరాబాద్, వెలుగు: చరిత్రను వక్రీకరించిన సినిమాకు, స్మగ్లర్ పాత్రకు గద్దర్ అవార్డులు ఇస్తారా? అని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఇది గద్దర్ ఆశయాలకు అత్యంత విరుద్ధమన్నారు. ఉత్తమ చారిత్రక చిత్రంగా ‘రజాకార్’ను ఎంపిక చేసి.. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వాదిగా వ్యవహరించారని విమర్శించారు. ఈ విధానం కాంగ్రెస్ పార్టీకి, లౌకిక ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 

గురువారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ అవార్డుల ప్రకటన యావత్ కళా హృదయాలను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించిన, మత ఉన్మాదాన్ని ప్రేరేపించిన సినిమాలకు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం కరెక్ట్​కాదన్నారు. అవార్డు సెలక్షన్ కమిటీని రద్దు చేసి, ఏ ప్రామాణికతను పాటించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ సినిమా జానపద జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మురళీధర్ దేశ్​పాండే, ప్రజా సాంస్కృతిక కేంద్రం ఉపాధ్యక్షుడు పొన్నం రాజయ్య గౌడ్, ఆదివాసీ కళాకారులు పాయం విజయ, మండేపూడి శమంతకమణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.