ప్రధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

ప్రధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీని కలిశారు. జాతీయ ర‌హ‌దారి 65పై మ‌ల్కాపూర్ నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాల‌ని కోరారు.

హైదరాబాద్ నుండి విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 65 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.ప్రస్తుతం ఎన్హెచ్ 65 రహదారిని ఆరు లేన్లుగా మారుస్తున్నారని అన్నారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 వరుసల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, 44 కిలోమీటర్ల వరకు పనులు చేస్తున్నారని వెల్లడించారు. రోజురోజుకు ఈ రోడ్డుపై వాహ‌నాల సంఖ్య పెరుగుతోందని, ప్రజా అవసరాల దృష్ట్యా రోడ్డును అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని మోదీని కోరారు.

మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ప్రస్తుత హైవేకు సమాంతరంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాల‌ని ప్రధానికి విన్నవించానని చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హైదరాబాద్, విజయవాడ మార్గంలో ఉన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరానని చెప్పారు. హైదరాబాద్, విజయవాడను కలిపే రహదారిలో 17 బ్లాక్ స్పాట్‌ల మరమ్మతు అంశంపైనా మరింత దృష్టి పెట్టాలని సూచించానన్నారు. ఈ అంశంపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.