రాజేశ్ మృతిపై ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ సీరియస్.. సూర్యాపేట ఎస్పీ, కలెక్టర్‌‌కు నోటీసులు.

రాజేశ్ మృతిపై ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ సీరియస్.. సూర్యాపేట ఎస్పీ, కలెక్టర్‌‌కు నోటీసులు.
  •  3 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కార్లే రాజేశ్​మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలీసుల చిత్రహింసల వల్లే రాజేశ్​ప్రాణాలు కోల్పోయాడన్న ఆరోపణలను సీరియస్‌‌గా తీసుకున్న కమిషన్.. తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మూడు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని సూర్యాపేట ఎస్పీ, జిల్లా కలెక్టర్‌‌ను ఆదేశించింది. 

న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసులో ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ రంగంలోకి దిగింది. కోదాడ పోలీసులపై బాధిత కుటుంబ సభ్యులు, హక్కుల సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సీఎంఆర్‌‌ఎఫ్ చెక్కుల కేసు విషయంలో రాజేశ్​ను ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు ఒప్పుకోలు ఇప్పించేందుకే పోలీసులు రాజేశ్​ను తీవ్రంగా కొట్టారని, ఆ చిత్రహింసలు భరించలేకే యువకుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తల్లి ఫిర్యాదు చేసినా స్పందించరా?

రాజేశ్​మృతిపై అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేయలేదన్న అంశంపై ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజేశ్​పోస్ట్‌‌మార్టం పూర్తి వీడియో రికార్డింగ్‌‌ను సమర్పించాలని, ఘటనపై జరిగిన మెజిస్ట్రియల్ విచారణ నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. 

అలాగే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుందా లేదా అన్న వివరాలు కూడా వెల్లడించాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించకపోతే తదుపరి చర్యలు కఠినంగా ఉంటాయని కమిషన్ హెచ్చరించింది.