నాదేం లేదు.. అంతా వాళ్లిద్దరే చూసుకున్నరు: ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న ట్రంప్

నాదేం లేదు.. అంతా వాళ్లిద్దరే చూసుకున్నరు: ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న ట్రంప్

వాషింగ్టన్: భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి నేనే కారణమంటూ పదే పదే డబ్బా కొట్టుకున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో నా ప్రమేయమేమి లేదని కుండబద్దలు కొట్టాడు. భారత్, పాక్ రెండు దేశాలే చర్చించుకుని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయని.. అందులో మూడో వ్యక్తి/దేశ ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చాడు.

అణ్వస్త్రాలు కలిగిన ఆ రెండు దేశాలు వ్యూహాత్మకంగా ద్వైపాక్షిక చర్చలు జరుపుకుని యుద్ధాన్ని ముగించాయన్నారు. భారత్, పాక్ రెండు తెలివైన దేశాలు అని కొనియాడారు ట్రంప్. అణ్వాయుధంగా మారే అణు యుద్ధాన్ని ఆపినందుకు భారత్, పాకిస్తాన్ నాయకులను ట్రంప్ ప్రశంసించారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‎లో భాగంగా పీవోకే, పాక్‎లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్‎కు కౌంటర్ పాక్ భారత్‎పై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. భారత్, పాక్ పరస్పరం డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసుకున్నాయి. 2025, మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కుదిరింది. 

అయితే, భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని.. వాణిజ్యం ద్వారా సీజ్‎ఫైర్ ఒప్పందం కుదిర్చానని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించాడు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో పక్షం ప్రమేయమే లేదని భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినప్పటికీ ట్రంప్ మాత్రం నా వల్లే సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. 

ఇదే విషయంపై బుధవారం (జూన్ 18) ప్రధాని మోడీ ట్రంప్‎తో ఫోన్‎లో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా జోక్యం లేదని సూటిగా ట్రంప్ కే తేల్చి చెప్పారు. ఈ పరిణామాల అనంతరం పాక్, భారతే చర్చించుకుని కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని.. ఇందులో నా ప్రమేయం లేదని ట్రంప్ అంగీకరించారు.