
- లడఖ్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు రెడీ చేసుకున్న ప్రేమికులు
- బ్యాంక్ నుంచి రూ.25 లక్షలు లోన్
- సుపారి గ్యాంగ్కు రూ.2లక్షలు చెల్లింపు
గద్వాల, వెలుగు: గద్వాల పట్టణానికి చెందిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రియుడు తిరుమల్రావు తన భార్యను, ప్రియురాలు భర్త తేజేశ్వర్ను మర్డర్ చేసి లడఖ్ వెళ్లేందుకు టికెట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రియురాలు తన భర్తను అడ్డు తొలగించుకోగా, హత్య వ్యవహారం బయటకు రావడంతో కథ అడ్డం తిరిగింది. ఇద్దరిని హత్య చేశాక లడఖ్ వెళ్లేందుకు బ్యాంక్ నుంచి రూ.25 లక్షల లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో రూ.2 లక్షలు సుపారి గ్యాంగ్ కు చెల్లించినట్లు ఇన్వెస్టిగేషన్లో తెలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూల్లోని ఒక బ్యాంకులో స్వీపర్గా పని చేస్తుండగా బ్యాంక్ మేనేజర్ తిరుమల్ రావు తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండగా, అతడు ఆమె కూతురుతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో మే 17న ఐశ్వర్య భర్త తేజేశ్వర్ను పక్కా ప్లాన్తో చంపేశారు. ఆ తర్వాత మేనేజర్ తన భార్యను కూడా చంపి ఇద్దరు కలిసి లడఖ్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే మేనేజర్ భార్య హత్య నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు ఇంకా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. పోలీసుల అదుపులో తల్లి సుజాత, కూతురు ఐశ్వర్యతో పాటు సుపారి గ్యాంగ్, బ్యాంక్ మేనేజర్ డ్రైవర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్రాక్ ఆధారంగా బ్యాంక్ మేనేజర్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెబుతుండగా, మరోవైపు పోలీసులు అదుపులోనే ఉన్నాడని అంటున్నారు.