- ట్రైన్లో తోటి ప్రయాణికుడి ఆరోపణ
పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లే తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్లో అండర్వేర్, బనియన్తో తిరుగుతూ వివాదంలో చిక్కుకున్న బీహార్కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ మద్యం మత్తులో అలా చేశారంటూ తోటి ప్రయాణికుడు ప్రహ్లాద్ పాశ్వాన్ ఆరోపించాడు. అలా తిరగడంపై ప్రశ్నించానని, దీంతో ఎమ్మెల్యే కోపంతో తన బంగారు ఉంగరం, చెయిన్ లాక్కున్నాడని చెబుతున్నాడు. దీనిపై ప్రహ్లాద్ ఢిల్లీ రైల్వే స్టేషన్లోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ట్రైన్లో అండర్ వేర్, బనియర్తో తిరగడం తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని తాను చెప్పినందుకు ఎమ్మెల్యే తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ప్రహ్లాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆయన తాగి ఉన్నాడని, తనను దుర్భాషలాడడమే కాకుండా తన గోల్డ్ లాక్కున్నాడని ఆరోపించారు.
ఎమ్మెల్యేపై ఆ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. తర్వాత ఆ కేసును బిహియా పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసు జూరిస్డిక్షన్ ఆ స్టేషన్ పరిధిలోకి వస్తుందని అందుకే మొదట కంప్లైంట్ తీసుకుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
కాగా, ఎమ్మెల్యే గోపాల్ మండల్ ట్రైన్లో అండర్ వేర్పై తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. ట్రైన్ ఎక్కిన తర్వాత కడుపు కరాబ్ కావడంతో అలా అండర్ వేర్తో బాత్రూమ్కి తిరగాల్సి వచ్చిందని ఎమ్మెల్యే గోపాల్ చెప్పారు. ఆ సమయంలో ట్రైన్ కోచ్లో మహిళలు ఎవరూ లేరని, తన వల్ల మహిళా ప్యాసింజర్లకు ఇబ్బంది కలిగిందన్నది అవాస్తవమని అన్నారు.