లాక్ డౌన్ కారణంగా తన భార్య పుట్టింటిలోనే ఉండిపోయిందన్న కోపంతో ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలని రెండో పెళ్లి చేసుకున్నాడు. బిహార్ రాష్ట్రంలోని పాలిగంజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు.. ఏ ఒక్కరూ ఇళ్ల నుంచి బయటికి రాకూడదని, ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ.. లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటనకు ముందే పాలిగంజ్ లో నివాసముండే ధీరజ్ కుమార్ అనే వ్యక్తి భార్య తన పుట్టింటికి వెళ్లింది. కొన్ని నెలల క్రితమే ధీరజ్తో పెళ్లి కావడంతో ఆమె తన పుట్టింటి వారిని చూసేందుకు వెళ్లగా.. లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండిపోయింది.
అయితే భార్యను తిరిగి రమ్మని ధీరజ్ ఆమెకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆమె రాలేకపోయింది. దీంతో భార్యపై కోపంతో..తన మాజీ ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకున్నాడు ధీరజ్. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ధీరజ్ కుమార్పై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.