
- అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం 246 మంది మృతి
- టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే క్రాష్
- మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
- అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన క్షణాల్లోనే ప్రమాదం
- మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలిన ఎయిరిండియా ఫ్లైట్
- ఆ వెంటనే పేలిపోవడంతో పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు
- విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మృతి
- ప్రాణాలు కోల్పోయిన మరో ఐదుగురు కాలేజీ స్టూడెంట్లు
- మృతుల్లో 61 మంది విదేశీయులు
- దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం
- పక్షి ఢీకొనడంతోనే కూలిపోయి ఉండొచ్చంటున్న నిపుణులు
- బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున టాటా గ్రూప్ పరిహారం
- ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, వివిధ దేశాల అధ్యక్షుల దిగ్ర్భాంతి
- విచారణకు ఆదేశించిన ఏవియేషన్ మినిస్ట్రీ
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి గురువారం మధ్యాహ్నం లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ ఏఐ171.. టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే మేఘాని నగర్ ఏరియాలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్పై కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో మొత్తం 246 మంది చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు. మిగిలిన 241 మంది మృతి చెందారు. కాలేజీ బిల్డింగ్ క్యాంటిన్లో భోజనం చేస్తున్న ఐదుగురు మెడికోలు కూడా ప్రాణాలు విడిచారు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదమని ఏవియేషన్ అధికారులు తెలిపారు.
మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్లో చదువుకుంటున్న తన కూతురును కలిసేందుకు ఆయన వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో పక్షులు ఢీకొట్టడంతో.. ఫ్లైట్ ఎగరడానికి కావాల్సిన వేగాన్ని అందుకోలేకపోయి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం 11 ఏండ్లుగా సేవలు అందిస్తున్నదని ఏవియేషన్ అధికారులు వివరించారు. పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారని, ఆ తర్వాత సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీ కొట్టి బిల్డింగ్పై కూలిందని తెలిపారు.
మృతుల్లో 229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది, ఐదుగురు మెడికల్ కాలేజీ స్టూడెంట్లు ఉన్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. కాగా, విమానంలో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక లోపాలు తలెత్తినట్లు విమర్శలు వస్తున్నాయి. గత డిసెంబర్లో ఇదే విమానం నుంచి పొగలు వచ్చాయని, ఏడాది వ్యవధిలోనే 2 సార్లు టెక్నికల్ సమస్యలు వచ్చినట్లు చెప్తున్నారు.
అసలేం జరిగింది?
ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం (ఏఐ171) అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయల్దేరేందుకు రెడీగా ఉన్నది. ప్లేన్లో మొత్తం 230 మంది ప్యాసింజర్లు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నారు. 23వ నంబర్ రన్ వే నుంచి విమానం టేకాఫ్కు సిద్ధమైంది. ఏటీసీ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది.
సరిగ్గా గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయింది. కొన్ని సెకండ్లలోనే సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు ఏటీసీకి సమాచారం ఇచ్చారు. అప్పుడు విమానం 825 అడుగుల ఎత్తులో ఉంది. ప్రమాదం పసిగట్టిన పైలట్లు.. మే డే కాల్ చేసి ఏటీసీకి హెల్ప్ అడిగారు. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం.. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే విమానం 625 అడుగుల ఎత్తుకు దిగిపోయింది.
అప్పుడే ఏటీసీ నుంచి సిగ్నల్స్ కోల్పోయింది. ఆ తర్వాత విమానం క్రమంగా కిందికి వస్తూ.. చెట్టును ఢీకొట్టింది. అనంతరం మేఘాని నగర్ ఏరియాలోని సిటీ సివిల్ హాస్పిటల్, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత విమానం పేలిపోయింది. టేకాఫ్ అయిన 50 సెకండ్లలోనే ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని మొత్తం 241 మంది చనిపోయారు. ఒకతను మాత్రమే బతికాడు. మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు స్టూడెంట్లు కూడా చనిపోయారు. విమానం కూలుతున్నప్పటి 38 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
దట్టంగా అలముకున్న పొగలు..
ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది, 2 బీఎస్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బిల్డింగ్పై విమానం కూలడంతో సహాయక చర్యల్లో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. గాయపడిన మెడికల్ కాలేజీ స్టూడెంట్లను దగ్గర్లోని హాస్పిటల్కు తరలించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో కౌంటర్ టెర్రరిస్ట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ముందుగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి బయల్దేరాయి. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో ప్రయాణికుల డెడ్బాడీలు గుర్తు పట్టేందుకు వీల్లేకుండా పూర్తిగా కాలిపోయాయి.
స్పందించిన బోయింగ్ కంపెనీ
విమానం కూలిన ఘటనపై అమెరికాలోని బోయింగ్ కంపెనీ ప్రతినిధులు స్పందించారు. ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉందన్నారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు పనిచేస్తున్నామని చెప్పారు.
చూస్తుండగానే కూలిపోయింది: ప్రత్యక్ష సాక్షులు
రన్వే పై నుంచి విమానం టేకాఫ్ అయ్యాక అసలు పైకి ఎగురలేదని.. కొన్ని క్షణాల్లోనే కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం చాలా తక్కువ ఎత్తులో వెళ్తున్నట్లు గమనించామని, చివరికి రెసిడెన్షియల్ ఏరియాలో కుప్పకూలిపోయిందని చెప్పారు. ‘‘మధ్యాహ్నం ఒకటిన్నర అవుతుందేమో.. ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను. ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది.
ఏం జరిగిందో బయటికొచ్చి చూసేసరికి ఆకాశంలో దట్టమైన పొగ కనిపించింది. మంటలు చెలరేగాయి. దగ్గరకెళ్లి చూస్తే.. కూలిపోయిన విమాన శకలాలతో పాటు చాలా డెడ్బాడీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. భయపడిపోయా.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పిన’’అని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమిత్ షా, రామ్మోహన్ నాయుడు
ఘటనాస్థలాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె. రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పరిశీలించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విజయవాడ నుంచి రామ్మోహన్ నాయుడు, ఢిల్లీ నుంచి అమిత్ షా హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. డీజీసీఏ, ఎయిరిండియా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్ గురించి తెలుసుకున్నానని చెప్పారు.
ప్రమాదానికి బాధ్యులను వదిలిపెట్టబోమని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. ‘‘గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. ప్రమాద ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది” అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేశారని, ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు విమానాల రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత కొన్ని సర్వీసులకు మాత్రమే డీజీసీఏ అనుమతి ఇచ్చింది.
ఆఖరి నవ్వులు..
భార్య, భర్త.. ఇద్దరూ డాక్టర్లు. వారికి ముగ్గురు పండంటి బిడ్డలు. వృత్తిరీత్యా లండన్లో సెటిలవ్వాలనుకున్నరు. విమానం ఎక్కాక.. పిల్లలతో కలిసి నవ్వుతూ ‘‘వెళ్లొస్తాం’’ అంటూ ఇలా సెల్ఫీ తీసి మిత్రులకు పంపారు. అలా ఫొటో పంపారో లేదో.. క్షణాల్లోనే వాళ్ల నవ్వులు ఆవిరయ్యాయి. విమానం కుప్పకూలింది. ఈ ఐదుగురి ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి. ఇట్ల.. ఎన్నో కుటుంబాలను విమాన ప్రమాదం బలితీసుకుంది.