- యువతకు బీజేపీ పిలుపు
- నిరసన దీక్ష పోస్టర్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో ఈ నెల 27న రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న ఒక రోజు నిరుద్యోగ నిరసన దీక్షను సక్సెస్ చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటు సిటీకి దగ్గరగా ఉన్న ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతను దీక్షకు తరలించే ఏర్పాట్లలో నేతలు బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి చర్చించేందుకు అన్ని జిల్లాల పార్టీ నేతలతో గురువారం పార్టీ స్టేట్ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశారు. దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. నిరుద్యోగ దీక్షకు సంబంధించిన పోస్టర్ను బుధవారం పార్టీ స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు, ఉపాధ్యక్షుడు మనోహార్ రెడ్డిలు రిలీజ్ చేశారు. ఈ దీక్షను విజయవంతం చేయాలని కోరారు.