IPL 2026: ఆర్సీబీ ‘కిరాక్’ విక్టరీ.. ముంబైపై 18 పరుగుల తేడాతో ఘన విజయం!

IPL 2026: ఆర్సీబీ ‘కిరాక్’ విక్టరీ.. ముంబైపై 18 పరుగుల తేడాతో ఘన విజయం!

IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్ర కొనసాగించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేస్తూ ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.

ముంబైకి ఆదిలోనే షాక్: 
భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (37), రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించి ఊపు మీద ఉన్న తరుణంలో సుయాష్ శర్మ ముంబైని దెబ్బకొట్టాడు. రికెల్టన్‌ను అవుట్ చేసిన సుయాష్, ఆ వెంటనే తిలక్ వర్మ (1)ను కూడా పెవిలియన్ పంపాడు. మరోవైపు, గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ క్రీజులో ఉండలేక 'రిటైర్డ్ హర్ట్'గా వెనుదిరగడం ముంబై జట్టు పతనాన్ని శాసించింది

సూర్య, హార్దిక్ కాసేపు మెరుపులు: 
సూర్యకుమార్ యాదవ్ (33), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (40) కాసేపు మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ కలిసి 47 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పేలా కనిపించారు. కానీ, పాండ్యా బ్రదర్స్ ఫైట్‌లో కృనాల్ పైచేయి సాధించాడు. సూర్యను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత హార్దిక్ కూడా జాకబ్ డఫీ బౌలింగ్‌లో రోమారియో షెపర్డ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

రూథర్‌ఫోర్డ్ ఒంటరి పోరాటం: 
నమన్ ధీర్ (1) తీవ్రంగా నిరాశపరచగా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (71 పరుగులతో నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో చెలరేగి ఒంటరి పోరాటం చేశాడు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డుని ముందుకు నడిపించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టుకి ఈ సీజన్‌లో మరో ఓటమి తప్పలేదు. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీసుకోగా, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.