ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ.. ఇదీ కేసీఆర్ తీరు

ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ.. ఇదీ కేసీఆర్ తీరు

తెలంగాణ: ఎన్నికలన్నా.. మోడీ అన్నా.. కేసీఆర్ గజగజ వణికిపోతున్నాడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మిస్తే.. అందరూ జెండా పండగ చేసుకోవాలనడం దారుణమని ఆయన అన్నారు. ఆయన తలపెట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఏడవ రోజు సందర్భంగా.. మన్నేగూడలో ఆయన జనాలను ఉద్దేశించి మాట్లాడారు. 

‘ఊపర్ షేర్వానీ...అందర్ పరేషానీ. ఇదీ కేసీఆర్ తీరు. ఎన్నికలంటే గజగజ వణికిపోతుండు. అందుకు ఢిల్లీకి పోయి కూర్చుండు. సీఎం ఢిల్లీ పోయి పార్టీ ఆఫీస్ కు శంకుస్థాపన చేస్తే.. అందరూ జెండా పండుగ చేసుకోవాలట. ఎవరైనా అట్ల చేసుకుంటరా? ప్రధాని మోడీని కలిసేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తుండు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే తప్పుడు సంకేతాలను పంపాలని కుట్ర చేస్తుండు. బీజేపీకి టీఆర్ఎస్ తో దోస్తీ ఉండదు. గతంలో ఎప్పుడైనా టీఆర్ఎస్ తో కలిసి బీజేపీ పనిచేసిందా? టీఆర్ఎస్ తో కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసినయ్ తప్ప.. ఏనాడూ బీజేపీ టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదు. మోడీని కలిసి బయటకు రావడమే తరువాయి.. ‘ శభాష్ కేసీఆర్’ అని మోడీ కితాబిచ్చినట్లుగా.. మనసు విప్పి మాట్లాడినట్లుగా మీడియాకు లీకులిస్తూ అబద్దపు వార్తలు రాయిస్తున్నడు. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే దుర్మార్గుడు కేసీఆర్. కోతల రాయుడు మాటలు నమ్మి మీడియా మోసపోవద్దని కోరుతున్నా. పీఎం మోడీ ప్రజాస్వామ్యవాది. ఏ రాష్ట్ర సీఎం వెళ్లి కలిసినా సమస్యలు వింటడు’ అని బండి సంజయ్ అన్నారు.