ముషీరాబాద్, వెలుగు: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, బీసీ పొలిటికల్ ఫ్రంట్, గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ పాల్గొన్నారు.
