సొంత ప్రయోజనాల కోసమే..రాష్ట్రం కోసం భేటీ అవ్వడం లేదు

సొంత ప్రయోజనాల కోసమే..రాష్ట్రం కోసం భేటీ అవ్వడం లేదు

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు రాష్ట్రం కోసం భేటీ అవ్వడం లేదని, సొంత ప్రయోజనాల కోసమే భేటీ అని ఆరోపించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్. ఈ భేటీ పై స్పందించిన ఎన్వీఎస్..ఇద్దరు మఖ్యమంత్రులు ఎందుకు భేటీ అవుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రయోజనాల కోసమే భేటీ అవుతుంటే..జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రిగా ఉన్న సబిత ఇంద్రారెడ్డి కేబినెట్ లో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో  బీజేపీ ఎక్కడ ఉందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.  నిజామాబాద్ లో కవితను , కరీంనగర్ లో వినోద్ ను అడిగితే బీజేపీ ఎక్కడుందో  చెప్తారని అన్నారు.  పార్టీలను , వ్యక్తులను ప్రలోభ పెట్టడంలో టీఆర్ఎస్ ను మించిన పార్టీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబెట్టిన 3వేలమంది అభ్యర్థుల్లో 15 వందలమంది అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని ఆరోపించారు.

పార్టీలు వేరైనా టీఆర్ఎస్, కాంగ్రెస్ లు కలిసి పని చేస్తున్నాయన్నారు.  రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో ఎంఐఎం అభివృద్ధికి  కృషి చేస్తున్నాయని ఎన్వీఎస్ ప్రభాకర్ విమర్శించారు.