తెలంగాణ ఉద్యమ స్పూర్తిని కేసీఆర్ అపహస్యం చేశారు

తెలంగాణ  ఉద్యమ స్పూర్తిని కేసీఆర్ అపహస్యం చేశారు

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ స్పూర్తిని సీఎం కేసీఆర్ అపహస్యం చేశారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై విమర్శించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. సమావేశాల సందర్భంగా 347 మంది జాతీయ నేతలు హైదరాబాద్ కు క్యూ కట్టారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో మకాం వేసిన బీజేపీ జాతీయ నేతలు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు మోడీ సభకు జన సమీకరణపైనా దృష్టి పెట్టారు.

మోడీ సభ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా V6 వెలుగుతో ముచ్చటించిన ఆయన.. హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారో టీఆర్ఎస్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియమకాలతో ప్రారంభమైన ఉద్యమ స్పూర్తిని కేసీఆర్ అపహస్యం చేశారని అన్నామలై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియజెప్పేందుకు కొన్ని నెలలుగా బీజేపీ నేతలు కష్టపడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించాలన్న ఆయన.. రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.