- రుణమాఫీ, పంట బీమా అమలు చేయాలని డిమాండ్
- బీజేపీ కిసాన్మోర్చా ధర్నా
- గోడలు, గేట్లు దూకి వ్యవసాయ కమిషనరేట్ ముందు బైఠాయింపు
రైతులకు రూ.లక్ష రుణమాఫీ, కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్తో బీజేపీ కిసాన్ మోర్చా చేపట్టిన వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీసు ముట్టడిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ముట్టడి కోసం ఎల్బీ స్టేడియానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, రైతులను అక్కడే ఆపేశారు. వాళ్లెవరూ బయటకు రాకుండా స్టేడియం గేట్లు మూసి తాళాలేశారు. దీంతో పోలీసులు, కిసాన్ మోర్చా నేతల మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
హైదరాబాద్, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ, కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్తో బీజేపీ కిసాన్ మోర్చా చేపట్టిన వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీసు ముట్టడిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ముట్టడి కోసం ఎల్బీ స్టేడియానికి తరలివచ్చిన కిసాన్మోర్చా రాష్ట్ర ఇన్చార్జి ప్రేమేందర్రెడ్డి, కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలోని పార్టీ కార్యకర్తలు, రైతులను అక్కడే ఆపేశారు. వాళ్లెవరూ బయటకు రాకుండా స్టేడియం గేట్లు మూసి తాళాలేశారు. దీంతో పోలీసులు, కిసాన్ మోర్చా నేతల మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే కొందరు కార్యకర్తలు గేట్లు, గోడలు దూకి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీసుకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎల్బీ స్టేడియంలోని వారిని, కమిషనర్ ఆఫీసుకు చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. రైతు సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేసేందుకు వచ్చిన తమను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రైతుల సమస్యలపై పోరాటం చెయ్యనివ్వకుండా పోలీసులను కేసీఆర్ అడ్డం పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ మాయల మరాఠీ వేషాలేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్కు బకాయి ఉన్న రూ.350 కోట్లే చెల్లించలేని సర్కార్.. ఇప్పుడు దళితుల కోసం రూ.40 వేల కోట్లను ఖర్చు చేస్తామంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. రైతులు, కిసాన్ మోర్చా నేతల అరెస్ట్పై బండి సంజయ్ మండిపడ్డారు. పంట బీమా అమలు చేయాలని, రుణమాఫీ చేయాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తియ్యటి మాటలు రైతుల కడుపులు నింపవన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు.