కశ్మీర్ కల్లోలానికి ముగింపు పలికిన ఘనత మోడీ, షాలదే

కశ్మీర్ కల్లోలానికి ముగింపు పలికిన ఘనత మోడీ, షాలదే

కరీంనగర్: “జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణం చట్టం, ఆర్టికల్ 370 రద్దు- వర్థమాన పరిస్థితులు” అంశంపై పద్మనాయక కల్యాణ మండపంలో బీజేపీ అధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఇతర నాయకులు, బీజేపీ వర్కర్లు పాల్గొన్నారు.

“70 ఏళ్ల కశ్మీర్ రావణ కాష్టానికి కారణమైన ఆర్టికల్ 370 రద్దు ఘనత ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షాకే దక్కుతుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణకు, జమ్మూ కాశ్మీర్ కు పోలికలున్నాయన్నారు. నిజాం నవాబు ఉక్కుపాదం కింద నలిగిపోతున్న ఈ గడ్డకు విముక్తి కలిగించేందుకు ఎందరో పోరాటం చేశారన్నారు. పాలకులు తెలంగాణ చరిత్రను కాలగర్భంలో కలిపారనీ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్ విలీన బాధ్యతలను తీసుకున్న నెహ్రూ మాత్రం.. అనేక ఆంక్షలతో ముడిపెట్టారని అన్నారు. ఆ తప్పే 370 ఆర్టికల్ రూపంలో దేశానికి గుదిబండగా మారిందన్నారు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో నివసించే వారందరికీ రాజ్యాంగ హక్కులు దక్కుతాయనీ.. జమ్ముకశ్మీర్ ప్రాంతం ఇకపై అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నేతల కామెంట్స్ పాకిస్థాన్ ను సమర్థించేలా ఉన్నాయన్నారు. తెలంగాణ విలీన చరిత్రను వెలికి తీసేలా సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు లక్ష్మణ్.