అసెంబ్లీ ఎన్నికల కోసం .. బీజేపీ రోడ్​మ్యాప్​

అసెంబ్లీ ఎన్నికల కోసం .. బీజేపీ రోడ్​మ్యాప్​
  • తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ
  • అన్ని మోర్చాలు క్రియాశీలకంగా పని చేయాలని జేపీ నడ్డా దిశానిర్దేశం
  • మోర్చాల అధ్యక్షులతో ఢిల్లీలో కీలక సమావేశం
  • అసెంబ్లీ ఎన్నికలకు షార్ట్ టర్మ్, జనరల్ ఎలక్షన్స్​కు లాంగ్​ టర్మ్​ ప్రచార వ్యూహాలు
  • వచ్చే వారం మరోసారి భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అన్ని మోర్చాలు క్రియాశీలకంగా పని చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. త్వరలో ఎన్నికలు జరుగునున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మోర్చాలు ఎవరికి వారిగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం షార్ట్​ టర్మ్​, జనరల్​ ఎలక్షన్స్​ కోసం లాంగ్​ టర్మ్​ ప్రచార వ్యూహాలు అమలు చేయాలన్నారు.  ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శనివారం జేపీ నడ్డా పార్టీ మోర్చాల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) బీఎల్ సంతోష్, రాష్ట్ర సంస్థాగత ఇంచార్జులు సునీల్ బన్సల్, శివ్ ప్రకాశ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ విస్తరణపై తొలుత మోర్చాల అధ్యక్షులు నివేదికలు సమర్పించారు. 

అలాగే వివిధ వర్గాలకు మోదీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ఎలా ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. వీటి ఆధారంగా ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి వచ్చే వారం మరోసారి కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలపై బ్లూ ప్రింట్ తయారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్​​, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల కోసం షార్ట్ టర్మ్, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం లాంగ్ టర్మ్ టార్గెట్లను ఫిక్స్ చేశారు. తెలంగాణతో పాటు ఎన్నికల రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, అందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. రాబోవు 10 నెలలు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పనిచేయాలని అధిష్టానం స్పష్టం చేసింది. 

ఓబీసీ ఆధ్వర్యంలో ఆగస్టులో ‘బీసీ గర్జన’ 

ఆగస్టులో ఓబీసీ ఆధ్వర్యంలో తెలంగాణలో భారీ ‘బీసీ గర్జన’చేపట్టాలని బీజేపీ సమావేశంలో ప్రతిపాదించారు. సమాజంలో దాదాపు 70 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ వర్గాలకు చేరువయ్యే దిశలో ప్రోగ్రాంలు నిర్వహించాలని నిర్ణయించారు. విశ్వకర్మ, మత్స్యకారుల, గొర్రెల కాపరులు, మైనార్టీలు, ఇతర వర్గాల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ర్యాలీలు నిర్వహించి, ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రతిపాదించారు. బీజేపీకి సంబంధించిన ఏడు మోర్చాల ఆధ్వర్యంలో వెంట వెంటనే ప్రోగ్రాంలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ దిశలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు.