గిరిజనుల రిజర్వేషన్ల డిమాండ్ కు బీజేపీ మద్దతు ఉంటుంది

గిరిజనుల రిజర్వేషన్ల డిమాండ్ కు బీజేపీ మద్దతు ఉంటుంది

హైదరాబాద్ : పోడు వ్యవసాయం చేసుకునే రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకం చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తానని చెప్పిన కేసీఆర్..హామీని నిలబెట్టుకోకుండా గిరిజనులపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అని చూడకుండా దాడులు చేయిస్తున్నారని అన్నారు. తాను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సేవాలాల్ జయంతి కోసం కోటి రూపాయలు కేటాయించామని చెప్పారు. దేశ వ్యాప్తంగా కూడా అధికారికంగా సేవాలాల్ జయంతి జరపాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతామని చెప్పారు. గిరిజనుల రిజర్వేషన్ల డిమాండ్ కు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని హామీ ఇచ్చారు. గిరిజనుల రిజర్వేషన్ల డిమాండ్ ను ప్రధాని మోడీకి అర్థమయ్యేలా చెబితే సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందన్నారు. ఖైరతాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహించిన ఆల్ ఇండియా బంజారా సెమినార్ కు ఎమ్మెలే ఈటల రాజేందర్ హాజరయ్యారు. 

ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం లంబాడా సోదరులని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వారికి తాము అండగా ఉంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తెలంగాణలో బంజారా సమాజం చైతన్య వంతమైందని, బంజారాలు కోట్లాది హక్కులను సాధించుకోవాలి అని సూచించారు. పోడు భూముల విషయంలో మానవత్వంతో పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాలన్నారు. తెలంగాణలో మొదలు పెట్టిన పోరాటాలు వృథాగా పోవని ఈటల రాజేందర్ అన్నారు.