బీజేపీలో రాజాసింగ్ లొల్లి .. తనపై వార్ స్టార్ట్ చేసేందుకు దొంగలంతా ఒక్కటయ్యారని వ్యాఖ్య

బీజేపీలో రాజాసింగ్ లొల్లి .. తనపై వార్ స్టార్ట్ చేసేందుకు దొంగలంతా ఒక్కటయ్యారని వ్యాఖ్య
  • బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది బీఆర్ఎస్ డిసైడ్ చేస్తుందనే కామెంట్​పై దుమారం
  • రెండోరోజూ వెనక్కి తగ్గని గోషామహల్​ ఎమ్మెల్యే

హైదరాబాద్,వెలుగు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని, బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయిస్తారన్న మాటలతో ఆ పార్టీలోని లుకలుకలు బయటపడ్డాయి. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి రాజాసింగ్​ కామెంట్స్​ మరింత బలం చేకూర్చేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత, రాజాసింగ్​వ్యాఖ్యలు బీఆర్ఎస్​తో పాటు బీజేపీకి నష్టంచేసేలా ఉన్నప్పటికీ బీజేపీ నుంచి పెద్ద లీడర్లెవరూ డ్యామేజ్​కంట్రోల్​కు ప్రయత్నించలేదు. ఢిల్లీలో ఉన్న  కిషన్​రెడ్డి ని ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. అది ఫ్యామిలీ డ్రామా అని,  పార్టీ నేతలెవరూ ఈ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేదంటూ ఇష్యూను చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారు. దీంతో ఆ పార్టీ కేడర్​మరింత అయోమయంలో పడిపోయింది.  

సోషల్​మీడియాలో వార్ 

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మొదటి నుంచీ ఆ పార్టీ సీనియర్​ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ను లక్ష్యంగా చేసుకొని  విమర్శలు గుప్పిస్తున్నారు.  శాసనసభాపక్ష నేత, హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు, హైదరాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి.. ఇలా ఎవరి ఎంపికలోనూ తనను సంప్రదించలేదని ఆయా నేతల తీరును బహిరంగంగానే తప్పుపట్టారు. కానీ  పార్టీపై ఈ స్థాయిలో ఏనాడూ విమర్శలు చేయలేదు.

 బీఆర్ఎస్​ను బీజేపీలో విలీనం చేయాలనే కుట్ర జరుగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ‘‘పెద్ద ప్యాకేజీ ఇస్తే మావోళ్లు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారు..” అంటూ రాజాసింగ్​కామెంట్ చేయడంతో బీజేపీలో కలకలం రేగింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ సోషల్​ మీడియాలో జోరుగా నడుస్తున్నది.  రాజాసింగ్​చెప్తున్నది నిజమేనని, కొందరు లీడర్లు బీఆర్ఎస్​చెప్పుచేతల్లో పనిచేయడం వల్లే పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోతున్నదని కొందరంటే, మరికొందరు మాత్రం రాజాసింగ్​ తీరును తప్పుపడ్తున్నారు. బీఆర్ఎస్ కుటుంబ గొడవల్లో తలదూర్చడం ద్వారా బీజేపీకి నష్టం కలిగిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. 

దొంగలంతా ఒక్కటయ్యారు​..

రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్​ గా మారాయి. ఆయనకు కౌంటర్ గా ఒకరు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టగా, ఆ పోస్ట్ ను కోట్ చేస్తూ ‘‘సోషల్ మీడియాలో కరీంనగర్ నుంచి నాపైన వార్ స్టార్ట్ అయింది. అందరు దొంగలు ఒకటయ్యారు కదా?’’ అని రాజాసింగ్ కామెంట్ చేశారు.  ఆ పోస్ట్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ పిక్ బండి సంజయ్ తో కలిసి ఉండటం గమనార్హం.  బండి సంజయ్​ పైనా రాజాసింగ్​ ఇన్ డైరెక్ట్​గా కామెంట్ చేయడంతో మరోసారి పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతమైనట్టయింది.  పార్టీ నేతలెవరూ కాంట్రవర్సీ అంశాలపై బహిరంగంగా నోరు జారొద్దని ఇదివరకే పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు హైకమాండ్​ ఆదేశాలు జారీచేసినా.. అవేవీ పట్టించుకోకుండా రాజాసింగ్​మళ్లీ మళ్లీ మాట్లాడుతుండడంతో హైకమాండ్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.