హైదరాబాద్: కరోనా ట్రీట్ మెంట్ లో రూ.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు అప్పుల పాలవుతున్నారని సీరియస్ అయ్యారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ప్రజలు వేలల్లో చనిపోతున్నారని.. లక్షల మంది కరోనా బాధిత కుటుంబాలు హాస్పిటల్ ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా కుదేలయ్యాయని తెలిపారు.
ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయడం లేదన్న రాజాసింగ్.. సర్కార్ హాస్పిటళ్లకు పోలేక, ప్రైవేటు హాస్పిటల్స్ లో ఫీజులు చెల్లించలేక కరోనా బాధితులు ప్రాణాలు వదులుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కోవిడ్ ట్రీట్ మెంట్ ను చేర్చాలన్న డిమాండ్ తో మే-19న రాష్ట్ర బీజేపీ చేపట్టబోయే “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” ను విజయవంతం చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.