
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. కవిత జైలుకెళ్తే ఎన్నికల్లో తనమీద ఎవరు పోటీచేస్తారనే అర్ధం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ‘‘అయ్యయ్యో..ఇప్పుడు ఎలెక్షన్లల నా మీద ఎవరు వెంటాడి, వేటాడి నిలవడతరు’’ అని అర్వింద్ ట్వీట్ చేశారు.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ చేర్చింది. ఆమెతోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా మొత్తం 36 మంది పేర్లను యాడ్ చేసింది. లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడు విజయ్ నాయర్కు సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు అందాయని, ఈ గ్రూప్ను కవిత, శరత్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి లీడ్ చేశారని వెల్లడించింది. ఆధారాలు దొరక్కుండా 10 మొబైల్ ఫోన్స్ను కవిత డ్యామేజ్ చేయడం, మార్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని, ఇందులో 6209999999 ఫోన్ నంబర్తో మాట్లాడినప్పుడు ఆరు ఫోన్లు, 8985699999 ఫోన్ నంబర్తో నాలుగు ఫోన్లు మార్చినట్లు, ధ్వంసం చేసినట్లు ఈడీ పేర్కొంది.
గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ నెల ఆగస్టు వరకు ఈ చర్యలకు పాల్పడ్డట్లు రిపోర్టులో వివరించింది. స్కామ్తో సంబంధం ఉన్న 36 మంది నిందితులు/అనుమానితులు 170 ఫోన్లను మార్చారని, తాము కేవలం 17 ఫోన్లను రికవరీ చేయగలిగామని తెలిపింది. మిగతా ఫోన్లను ఆధారాలు దొరకకుండా నిందితులు ధ్వంసం చేశారని, అవి దొరికి ఉంటే ముడుపుల లెక్క ఇంకా ఎక్కువగా ఉండేదని ప్రధానంగా ప్రస్తావించింది. ధ్వంసమైన 153 ఫోన్ల విలువ కోటీ 38 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది.