టేక్మాల్/హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్తోడు దొంగలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పాల్వంచలో ఆదివారం జరిగిన జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ బూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శుల మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరినొకరు విమర్శించుకున్నట్లు డ్రామాలు ఆడుతూ అసలు నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ట్యాపింగ్ విషయంలో పాత్రధారులను ప్రశ్నిస్తున్నారు తప్ప అసలు సూత్రధారులు ఎవరో బయటపెట్టడం లేదన్నారు.
తమ ఫోన్లను ట్యాప్ చేశారని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక విచారణ పేరుతో ఆ వ్యవహారాన్ని వదిలేసింది” అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, విజయపాల్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, అరుణతార తదితరులు పాల్గొన్నారు. కాగా, బీఆర్ అంబేద్కర్ కలలను ప్రధాని మోదీ నిజం చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి లక్ష్మణ్ నివాళులర్పించారు.