బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌ది తల్లీబిడ్డల బంధం : లక్ష్మణ్

బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌ది తల్లీబిడ్డల బంధం : లక్ష్మణ్

బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌ పార్టీలది తల్లి, బిడ్డల బంధమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. ఈ రెండు పార్టీలకు పెంపుడు కొడుకైన మజ్లిస్‌‌.. వారికి వారధిగా పని చేస్తున్నట్లు ఆరోపించారు. వారి బంధాన్ని బీజేపీకి ముడిపెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌‌‌‌పై ఉన్న ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా ఇరు పార్టీలు కలిసి ప్లాన్ చేశాయని, ఇందులో భాగంగానే బీజేపీకి బీఆర్ఎస్ చేరువైందని దుష్ప్రచారం చేస్తున్నారని పైర్ అయ్యారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్‌‌లో మొదలైందని, ఆయన నరనరాన హస్తం గుర్తే ఉందన్నారు. ఈ రెండు పార్టీల శరీరాలే వేరని, ఆత్మలు ఒక్కటేనన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు అనుకూలంగా కాంగ్రెస్, తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌‌కు కేసీఆర్ సపోర్ట్ ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. 2014, 2018 ఎన్నికల తర్వాత కూడా హోల్‌‌సేల్‌‌గా  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్‌‌లో చేరారని ఆయన గుర్తుచేశారు. 

త్వరలో బీజేపీ ఫస్ట్ లిస్ట్..

త్వరలో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి లిస్ట్ వస్తుందని లక్ష్మణ్ తెలిపారు. రానున్న వారం రోజుల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో అభ్యర్థుల ఎంపికపై చర్చ ఉంటుందని చెప్పారు. కల్వకుంట్ల గులాములు కావాలంటే బీఆర్ఎస్‌‌ను బలపర్చాలని.. అభివృద్ధి, సంక్షేమం కావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. కేసీఆర్, కేటీఆర్‌‌‌‌ కేవలం తోలు బొమ్మలని, వారిని తెరవెనక నుంచి ఆడించేది అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలని అన్నారు. బీఆర్ఎస్ రూపంలో తెలంగాణకు పట్టిన చెదలును వదిలించేందుకు బీజేపీయే శరణ్యమన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న ఈ తెలంగాణ నలుగురు కావాలా.. 4 కోట్ల మంది కోసమా అనేది ఆలోచించుకోవాలన్నారు.