బీజేపీ ఎంపీ రవికిషన్ ను ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త రూ. 3.25 కోట్లు మోసం చేశాడు. దీంతో అతని పై రవికిషన్ చీటింగ్ కేసు నమోదు చేశాడు. వ్యాపారవేత్త జితేంద్ర రమేష్కి, ఎంపీ రవికిషన్ 2012లో రూ. 3.25 కోట్లు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని వాపస్ ఇవ్వాలని తిరిగి కోరగా రమేష్ ఆయనకు రూ. 34 లక్షలను 12 చెక్కులుగా అందిచాడు. అయితే గతేడాది డిసెంబర్ 7న ఓ చెక్కును ఎస్బీఐలో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయింది. అనంతరం డబ్బుల కోసం రమేష్తో ఆయన చర్చలు జరపగా, అతని నుండి సంతృప్తికరమైన సమాధానం రాలేదు.
దీంతో రవికిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ఆయన పీఆర్వో పవన్ దూబే తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినీనటుడిగా బాగా పాపులర్ అయిన రవికిషన్.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రాంభువల్ నిషాద్పై 3,01,664 ఓట్ల ఆధిక్యంతో గెలిచి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.