
హైదరాబాద్, వెలుగు: మన భారతీయ విలువలు అంతర్జాతీయంగా బలపడేలా కృషి చేయాల్సి ఉందని బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు అన్నారు. న్యూజెర్సీలోని ఎడిసన్ లో ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ నేషనల్ ప్రెసిడెంట్ అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం 11ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రవాస భారతీయులు కుల, ప్రాంత, భాష, మత బేధాలు లేకుండా మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. అందరూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందని, దేశంపై ప్రేమ, అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షను అభినందించారు.
దేశభక్తి స్పృహ పెరుగుతుందని, అది మన ధర్మంతో ముడిపడి ఉందని, మన పూర్వీకుల నుంచి సంక్రమించిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పహల్గాం ఘటనకు భారత ప్రభుత్వం గట్టిగా సమాధానమిచ్చిందని మురళీధర్రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు ఏనుగుల కృష్ణా రెడ్డి, తెలంగాణ అఫ్ బీజేపీ- అమెరికా అధ్యక్షుడు విలాస్ జంబు, అమర్ గోస్వామి, గుంజన్ మిశ్ర, శ్రీకాంత్ రెడ్డి, కమ్యూనిటీ లీడర్స్ శరత్రెడ్డి , హరి ఇప్పనపల్లి, గోపి, బాలగురు, సంతోష్ కోరం, దేవ్ కాకర్ల తదితరులు పాల్గొన్నారు.