
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. నిన్న ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద జరిగిన నిరసన కార్యక్రమం..ఇవాళ బండి సంజయ్ హౌజ్ అరెస్ట్..ప్రస్తుత పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.
జనగామ జిల్లాలోని పామునూరు వద్ద బండి సంజయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయంపై మొదట క్లారిటీ ఇవ్వలేదు. సిద్ధిపేట, కరీంనగర్ పీఎస్ కు తరలిస్తారని ప్రచారం జరిగినా చివరకు ఇంటికి తరలించారు. ప్రజాసంగ్రామ పాదయాత్రకు కేంద్ర బలగాలు కావాలని బండి సంజయ్ కోరారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసిన ఆయన రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని.. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంగ్రామ యాత్ర యాథావిధిగా భ్రదకాళి ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను, అవినీతి అక్రమాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.