దేశంలో అవినీతి పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ముందంజలో ఉందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట అర్బన్ మండలం నాంచారు పల్లె గ్రామ శివారులో జిల్లా బీజేపీ నూతన భవన నిర్మాణం భూమి పూజకు శంకుస్థాపనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం భూమి పూజ చేయడం సంతోషం గా ఉందన్నారు. 25 జిల్లాలో భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరో 8 జిల్లాలో భూమి పూజ చేస్తామన్న లక్ష్మణ్.. దేశం నలుమూలల బీజేపీ జండాలు ఎగురుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా.. 6 సంవత్సరాల్లో దేశాన్ని ప్రగతి పథంవైపు నడిపించింది ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు. 9 కోట్ల మంది మహిళలకు ఉచితం గా గ్యాస్ కనెక్షన్లు, 9 కోట్ల మరుగుదొడ్లు ఇచ్చిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు. అగ్రవర్ణ పేదల కు 10 శాతం రిజర్వేషన్లు, ట్రిబుల్ తలాక్, 370 ఆర్టికల్ , ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రామమందిర నిర్మాణాన్ని మోడీ గంట వ్యవధిలో పరిష్కరించారని కొనియాడారు. రామమందిర నిర్మాణంపై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును దేశంలోని అన్నీపార్టీలు, మతాలు స్వాగతీస్తున్నాయని వ్యాఖ్యానించారు.
దేశంలో అవినీతి పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ముందు ఉందన్న బీజేపీ అధ్యక్షుడు ..రాష్ట్రంలో జరుగుతున్నవి ఆత్మహత్య లు కావని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలని విమర్శించారు. ఉద్యమం సమయంలో ఆర్టీసీ కార్మికులు తో పెట్టుకుంటే అగ్గితోటి పెట్టుకున్నట్లేనన్న కేసీఆర్ ఇప్పుడు అదే ఆర్టీసీతో పెట్టుకొని చేతులు కాల్చుకునే పరిస్థితి లో ఉన్నారన్నారు. ఒక్క రోజు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగం కు రాకుంటే డిస్మిస్ చేస్తామంటున్నా , 6 సంవత్సరాల నుండి సచివాలయానికి రాని కేసీఆర్ ను ఎప్పుడో డిస్మిస్ చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయే పార్టీ అని, రాష్ట్రంలో టీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే పార్టీ బీజేయేనని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్ .

